Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ జెన్కో
- రాష్ట్ర సర్కార్కు నోటీసులు
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రూ.6283.68 కోట్ల బకాయిలను చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (జెన్కో) తెలంగాణ హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. ఏజీ జెన్కో ఎండీ బి.శ్రీధర్ దాఖలు చేసిన పిటిషన్ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సోమవారం విచారణ జరిపి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అగ్రిమెంట్లకు విరుద్దంగా తెలంగాణ ప్రభుత్వ చర్యలు ఉన్నాయనీ, బకాయిలు చెల్లించడం లేదని ఏపీ అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం వాదించారు. ఇందులో అసలు రూ.3441.78 కోట్లని, గత నెల 31న నాటికి వడ్డీ రూ. 2841.90 కోట్లు అయ్యిందని తెలిపారు. వాదనల తర్వాత రాష్ట్ర విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎస్పీడీసీఎల్), నార్తరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ల చైర్మెన్, ఎండీలతోపాటు తెలంగాణ పవర్ కోఆర్డినేషన్ కమిటీ చైర్పర్సన్లు కౌంటర్ దాఖలు చేయాలన్నది. విచారణ అక్టోబరు 28కి వాయిదా వేసింది.
ఏపీపీ పోస్టుల భర్తీ ప్రక్రియ వచ్చే నెల నాటికి పూర్తి చేయాలి
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 740 అదనపు పీపీ పోస్టులను భర్తీ చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలనీ, అక్టోబర్ 31 నాటికి రాత పరీక్షల ఫలితాలను వెల్లడించాలని హైకోర్టు ఆదేశించింది. పది జిల్లాల కోర్టుల్లోనే 740 పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, వీటి భర్తీ చేయక కోర్టుల్లో క్రిమినల్ కేసుల విచారణ తీవ్ర జాప్యం అవుతున్నదని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. 33 జిల్లాల్లో కోర్టులు ఏర్పడితే ఏం కావాలని ప్రశ్నించింది. మూడు నెలల గడువు కావాలని ప్రభుత్వం కోరింది. మనమేమీ త్రేతాయగంలో లేమనీ, 21వ శతాబ్ధంలో ఉన్నామని గమనించాలని వ్యాఖ్యానించింది. అక్టోబర్ 31 నాటికి ఆ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు జరిపి ఫలితాలను కూడా వెల్లడించాలని సోమవారం యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ వినోద్కుమార్ల డివిజన్ బెంచ్ ప్రభుత్వానికి ఉత్తర్వులిచ్చింది. పీపీ పోస్టుల ఖాళీలపై రిజిస్ట్రార్ జనరల్రాసిన లేఖను హైకోర్టు పిల్గా స్వీకరించి విచారణ చేస్తున్నది. తదుపరి విచారణ నవంబర్కు వాయిదా వేసింది.
భారీ వర్షాల నష్టంపై రాష్ట్రం సాయం కోరలేదా?
రాష్ట్రంలో 2020 అక్టోబర్, నవంబర్ నెలల్లో భారీ వర్షాలకు పంటలు నష్టపోయాయనీ, సాయం చేయాలని రాష్ట్రం కోరితే వాటి వివరాలను అందజేయాలని కేంద్రాన్ని యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ వినోద్కుమార్ల డివిజన్ బెంగ్షీ సోమవారం ఆదేశాలు జారీ చేసింది.అప్పుడు వర్షాలకు 12లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయనీ,రూ.8633 కొట్ల పంట నష్టం వాటిల్లిందని అయినా పంటల బీమా,ఇన్పుట్ సబ్సిడీలను రాష్ట్రం ఇవ్వలేదని కిరణ్కుమార్ మరో ఇద్దరు పిల్ దాఖలు చేశారు.అప్పడు వర్షాలకు నష్టమేమీ జరగలేదని ప్రభుత్వం చెప్పింది.దీనిపై పిటిషనర్ అభ్యంతరం చెప్పారు. కేంద్రం సాయం కింద విపత్తుల సాయం కింద రూ.977 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీ కింద రూ. 188 కోట్లను వినియోగించేందుకు అనుమతి ఇచ్చిందని కేంద్రం చెప్పింది.రైతుభరోసా ఇస్తున్నామని రాష్ట్రం చెప్పడంపై హైకోర్టు అభ్యంతరం చెప్పింది.విపత్తులకు నష్టపోకపోయినా రైతుభరోసా అందుతున్నదనీ, నష్టపోయిన రైతులకు విపత్తుల సాయం కింద ఏం ఇచ్చారో చెప్పాలని కోరింది.సాయం కోసం కేంద్రాన్ని రాష్ట్రం ఏం కోరిందో చెప్పాలని ఆదేశించి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.