Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీపీ, మున్సిపల్ కార్మికుల డిమాండ్
- రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నా
- అక్టోబర్ 4న చలో హైదరాబాద్
నవతెలంగాణ-విలేకరులు
పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు రాష్ట్రప్రభుత్వం పెంచిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు కదం తొక్కారు. సోమవారం గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికుల పలు సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినదించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలనీ, లేని పక్షంలో రాబోయో కాలంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని పలు కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. మల్టీపర్పస్ పేరిట కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పని భద్రత కల్పించడంతో పాటు ప్రజాప్రతినిధుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. మున్సిపాల్టీల్లో ఔట్సోర్సింగ్ విధానంలో కార్మికులతో పని చేయిస్తూ నెలలతరబడి వేతనాలు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం హామీనిచ్చినట్టుగా వేతనాలు చెల్లించాలని లేకపోతే అక్టోబర్ 4వ తేదీన చలో హైదరాబాద్ చేపడతామని హెచ్చరించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఇఫ్య్టూ, ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్డడి నిర్వహించారు. ముందుగా స్థానిక కార్మిక సంఘం కార్యాలయం నుంచి కార్మికులతో కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. భద్రాచలంలో సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి సబ్కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. నిజామాబాద్లో మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టగా.. కామారెడ్డిలోనూ ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించారు.సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేపట్టి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో సీఐటీయూ, ఎఫ్టీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ పార్కు నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు గాంధీ పార్కు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ మనూ చౌదరికి వినతిపత్రం అందజేశారు. నల్లగొండ, సూర్యాపేట కలెక్టరేట్ల ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేటలో ఎంపీడీవో జలేందర్రెడ్డికి వినతి పత్రం అందజేశారు.