Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పారిశ్రామికీకరణ జరుగుతున్నా.. ఉపాధి ఏది ?
- 5 జీవోలకు గెజిట్ ఇవ్వాలి
- యాజమాన్యాల బ్లాక్ మెయిల్కు లొంగుతున్న రాష్ట్ర ప్రభుత్వం: సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
- చౌటుప్పల్కు చేరిన కార్మిక గర్జన పాదయాత్ర
నవతెలంగాణ-చౌటుప్పల్రూరల్
ఉత్తర భారతదేశం నుంచి వలస కార్మికులను తీసుకొస్తున్న పరిశ్రమల యాజమాన్యాలు.. వారి శ్రమను దోపిడీ చేస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య అన్నారు. పారిశ్రామికీకరణ జరుగుతున్నా స్థానికులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించడం లేదన్నారు. ఈనెల 8న రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ప్రారంభమైన కార్మిక గర్జన పాదయాత్ర సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలానికి చేరుకుంది. తూప్రాన్పేట, దండుమల్కాపురం, కొయ్యలగూడెం గ్రామాల్లో పాదయాత్ర బృందానికి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో వీరయ్య మాట్లాడారు.
చౌటుప్పల్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందు తున్నా ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించకపోవడం దారుణమన్నారు. మండలంలోని పరిశ్రమల్లో వలస కార్మి కులు సుమారు 25 వేల మంది పని చేస్తున్నారని, వారు శ్రమ దోపిడీ గురించి ప్రశ్నించరనే యాజమాన్యాలు ఇష్టాను సారం వ్యవహరిస్తున్నాయని అన్నారు. దివీస్, శ్రీని లాంటి పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగి కార్మికులు గాయపడినా బయటికి రానివ్వడం లేదన్నారు. వలస కార్మికులు చనిపో తున్నా కనీసం నష్ట పరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కనీస వేతన చట్టాలను సవరించలేదని తెలిపారు. 73 షెడ్యూల్స్కు చెందిన కోటీ 20 వేల మంది కార్మికులు ఉన్నారని, పదేండ్లుగా కనీస వేతన సవరణ చేయక యాజమాన్యాలు రూ.3000 కోట్లు దండుకున్నాయని అన్నారు. ఐదు రంగాల్లో ఇచ్చిన జీవోల కు గెజిట్ చేయకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. యాజమాన్యాల బ్లాక్ మెయిల్స్ కు భయపడి ప్రభుత్వం గెజిట్ చేయడం లేదని విమర్శిం చారు. ప్రతిష్ట కంపెనీ పేరు కార్మికులను వేధిస్తోందన్నారు. కార్మికులు డ్యూటీలో కునుకు తీస్తే 30 రోజులపాటు పనికి రావొద్దని వేధించడం దుర్మార్గమన్నారు. బోనస్, పీఎఫ్, ఈఎస్ఐ లాంటి సదుపాయాలు ఉండవనికొత్త కార్మికుల నుంచి ముందుగానే రాయించుకోవడం దారుణమన్నారు. అప్రతిష్ట పనులు చేస్తున్న ప్రతిష్ట కంపెనీపై ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోదని ప్రశ్నించారు.
అమలు కాని కార్మిక చట్టాలు : సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్
ష్ట్రంలో కార్మిక చట్టాలు ఎక్కడా అమలు కావడం లేదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ అన్నారు. పాదయాత్ర సందర్భంగా తూప్రాన్పేట, కొయ్యలగూడెం గ్రామాల్లో నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడారు. పాదయాత్రకు కార్మికుల నుంచి అపూర్వ స్పందన వస్తోందన్నారు. ఆదిబట్లలోని టాటా కంపెనీలో యూనియన్ పెట్టినందుకు 100 మంది కార్మికులను తొలగించారని, కంపెనీ ముందు నుంచి పాదయాత్ర వస్తే యాజమాన్యం కుట్రలు బయటకు వస్తాయని కుట్ర పన్ని పోలీసులను పెట్టి తమను అరెస్టు చేయించిందన్నారు. కాటేదాన్ ఏరియాలో కనీస వేతనం అమలు కావడం లేదన్నారు. రూ.6 వేల నుంచి రూ.8 వేల వేతనం మాత్రమే ఇస్తున్నట్టు పాదయాత్ర దృష్టికి వచ్చిందని తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ ఉద్యమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జయలక్ష్మి మాట్లా డుతూ.. తమ పాదయాత్రలో అనేక సమస్యలు వెలుగు లోకి వస్తున్నాయన్నారు. అనేక ప్రాంతాల్లో కార్మికులకు సరైన ఇండ్లు కూడా లేవన్నారు. కనీసం వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పరిశ్రమల్లో మహిళా కార్మికులకు వారాంతపు సెలవులు ఇవ్వడం లేదని, ప్రసూతి సెలవులు ఇవ్వడం లేదని అన్నారు. కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో ఓ కంపెనీలో మహిళపై లైంగిక దాడి జరిగినా యాజమాన్యం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎఫ్, బోనస్, ఈఎస్ఐ లాంటి సదుపాయాలు అందడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయ కులు వంగూరు రాములు, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి దాసరి పాండు, జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం, తుర్కపల్లి సురేందర్, ఎమ్డి.పాషా, ప్రజా సంఘాల నాయకులు రొడ్డ అంజయ్య, బూర్గు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.