Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 400 కిలోమీటర్ల రోడ్డు దిగ్బంధం : అఖిలపక్షం
- జిల్లాల్లోనూ 30 సదస్సులు జరపాలి
- ఆదివాసీలు, మహిళలు, పిల్లలను పెద్దఎత్తున కదిలించాలి
- గిరిజనులను అడవి నుంచి వెళ్లగొడితే సహించేది లేదు
- కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే కుట్రను ప్రతిఘటిస్తాం
- సీఎం కేసీఆర్ ఒక్క ఎకరాకు పట్టాలివ్వలేదు
- అధికారుల దాడులు, దౌర్జన్యాలు, కేసులు ఆపాలి
- గవర్నర్, ఎంపీ, ఎమ్మెల్యేలకు మెమోరాండాలు
- అటవీ హక్కుల చట్టం ప్రకారమే సాగు చేసే వారికి హక్కు పత్రాలివ్వాలి
- అఖిలపక్ష సదస్సులో నేతల డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం అమలు చేయాలనీ, పోడు రైతులకు భూమిపై హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ వచ్చేనెల 5న పోడు రైతు రాస్తారోకో చేపట్టాలని అఖిలపక్ష సదస్సు నిర్ణయించింది. 400 కిలోమీటర్ల పొడుగునా దళాలుగా ఏర్పడి ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రోడ్లను దిగ్బంధించాలని పిలుపునిచ్చింది. పోలీసుల జీపులూ రావడానికి వీల్లేకుండా పకడ్బందీగా రాస్తారోకో చేపట్టాలని సూచించింది. జిల్లాల స్థాయిలోనూ 30 సదస్సులు జరపాలని కోరింది. ఆదివాసీలు, గిరిజనులు, గిరిజనేతరులు, మహిళలు, పిల్లలు పెద్దఎత్తున కదిలితేనే కేసీఆర్ ప్రభుత్వ వైఖరిలో మార్పు వస్తుందని వివరించింది.
హరితహారం పేరుతో పంట పొలాలను నాశనం చేయడం, గిరిజనులపై దాడులు, దౌర్జన్యాలు చేయడం, అక్రమంగా కేసులు నమోదు చేయడం ఆపాలని డిమాండ్ చేసింది. వారిని అడవి నుంచి వెళ్లగొడితే సహించేది లేదని హెచ్చరించింది. అటవీ సంపదను, ఖనిజాలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే కుట్రను ప్రతిఘటిస్తామని ప్రకటించింది. పోడు రైతుల ఇబ్బందులపై గవర్నర్, ఎంపీ, ఎమ్మెల్యేలకు మెమోరాండాలు సమర్పించాలని నిర్ణయించింది. అటవీ హక్కుల చట్టం ప్రకారమే సాగు చేసే వారికి హక్కు పత్రాలివ్వాలని డిమాండ్ చేసింది. పోడు రైతు పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'పోడు రైతు పొలికేక' పేరిట అఖిలపక్ష సదస్సు టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా టీ 33 యూట్యూబ్ ఛానెల్ను నాయకులు ఆవిష్కరించారు. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్ నేతలను వేదికపైకి ఆహ్వానించారు.
ప్రజలు ఐక్యంగా కదిలితేనే ప్రభుత్వాన్ని నిలదీయగలం : తమ్మినేని
ప్రజలు ఐక్యంగా కదిలితేనే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీయగమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ప్రతి గ్రామం, గూడెం నుంచి ప్రజలు కదలాలని ఆయన పిలుపునిచ్చారు. పోడురైతు రాస్తారోకో విజయ వంతమైతే కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలనీ, దౌర్జన్యాలు, కేసులు నమోదు చేయడం, కందకాలు తవ్వడం ఆపాలని అన్నారు. గిరిజనులు, ఆదివాసీల మధ్య చిన్న తేడాలను చూసి ఐక్యం కాకపోతే తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. అడవిని, ఆదివాసీలను, భూమిని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. హరితహారం, పర్యావరణం పేరుతో అడవి నుంచి వారిని వెళ్లగొడితే చూస్తూ ఊరుకో బోమని హెచ్చరించారు. ఖనిజాలు, ఇతర వనరుల కోసం కార్పొరేట్ సంస్థలకు సర్వే చేసేందుకు ఎందుకు అనుమతి ఇస్తున్నారని ప్రశ్నించారు.
రాస్తారోకోను విజయవంతం చేయాలి : కోదండరామ్
వచ్చేనెల 5న పోడు రైతు రాస్తారోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్ అన్నారు. అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సాగుచేసుకుంటున్న ఆదివాసీలు, గిరిజనులకు భూమిపై హక్కు కల్పించాలని కోరారు.
రాజ్యాంగం ప్రకారమే గిరిజనులకు భూమిపై హక్కు : రావుల
అటవీ భూములపై గిరిజనులకు రాజ్యాంగమే హక్కు కల్పించిందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్రెడ్డి చెప్పారు. ఈ సమస్యపై రాష్ట్రపతి, గవర్నర్కు మెయిల్ ద్వారా మెమోరాండం పంపాలని సూచించారు. పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశం చర్చకు వచ్చేలా ఎంపీల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
రాజనీతితో సీఎం వ్యవహరించాలి : కూనంనేని
సీఎం కేసీఆర్ రాజనీతితో వ్యవహరించాలనీ, పోడు రైతుల సమస్యను పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. కుర్చీ వేసుకుని కూర్చోవాల్సిన అవసరం లేదనీ, ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి పరిష్కరించాలని సూచించారు. రాజ్యాంగానికి భిన్నంగా అడవి నుంచి గిరిజనులను వెళ్లగొట్టాలని సుప్రీంకోర్టు చెప్పడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల గౌరవాన్ని, ప్రతిష్టను ప్రధాని మోడీకి తాకట్టు పెట్టే స్థాయికి సీఎం కేసీఆర్ దిగజారిపోయారని విమర్శించారు.
పోడు భూముల సమస్యపై పోరాడాలి : సీతక్క
పోడు భూముల సమస్యపై ఐక్యంగా పోరాడాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. దున్నే వాడికే భూమి అన్నట్టుగా సాగుచేసుకునే వారికే అటవీ భూమి చెందుతుందని చెప్పారు. కానీ అటవీ అధికారులు ఆదివాసీలను వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఈ పోరాటం ద్వారా పోడు రైతులకు భరోసానివ్వాలని సూచించారు. కోర్టుల నుంచి అనుమతి తెచ్చి గిరిజనుల భూమిని గుంజుకుంటున్నారని అన్నారు.
కేసీఆర్ మీద యుద్ధం చేస్తాం : పోటు రంగారావు
పోడు భూమిని సాగుచేసుకుంటున్న గిరిజనులు, ఆదివాసీలపై యుద్ధం ఆపకపోతే కేసీఆర్ మీద యుద్ధం చేయాల్సి వస్తుందని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు హెచ్చరించారు. అడవుల మీద ఆదివాసీలకే అధికారం ఉంటుందన్నారు. అడవులను, ఆదివాసీ లను రక్షించుకోవాలని చెప్పారు. ఓపెన్ కాస్ట్ మైనిం గ్తో అడవులు నాశనమవుతున్నాయనీ, ఖనిజాలు దోచుకునేందుకు కార్పొరేట్ సంస్థలకు భూమిని కట్టబెడుతున్నారని వివరించారు. దొంగలరాజ్యంగా తెలంగాణ మారిపోయిందని విమర్శించారు.
మాట తప్పిన కేసీఆర్ : సాదినేని
సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాల కోరని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు విమర్శించారు. సాగుచేసుకునే వారికి హక్కు పత్రాలిస్తామంటూ కేసీఆర్ హామీ ఇచ్చి మాట తప్పారని అన్నారు. కేసీఆర్, మోడీ కలిసి సంపదను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారని చెప్పారు.
బలవంతపు భూసేకరణను ఆపాలి : జూలకంటి
అటవీ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు చట్టాన్ని సవరిస్తున్నారని అన్నారు. సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ పరిశ్రమల పేరుతో బలవంతపు భూసేకరణను ఆపాలని డిమాండ్ చేశారు.
ఎన్నికలొస్తేనే స్పందిస్తారా?
2023లో అసెంబ్లీ ఎన్నికలొ స్తేనే సీఎం కేసీఆర్ పోడు భూము లపై స్పందిస్తారని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు.
అటవీ భూములైనా సాగు చేసుకునే గిరిజనులకే హక్కు
రాష్ట్రంలో 12.70 లక్షల ఎకరాల అటవీ భూమి గిరిజనుల సాగులో ఉందని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ (ఏఏఆర్ఎం) చైర్మెన్, మాజీ ఎంపీ మిడియం బాబురావు అన్నారు. ఆ భూమి రిజర్వు ఫారెస్టులో ఉన్నా సాగుచేసుకునే గిరిజనులకు హక్కు పత్రాలివ్వాలని అటవీ హక్కుల చట్టంలో ఉందన్నారు. భూమి ఇవ్వడం ప్రభుత్వానికి ఇష్టం లేదనీ, అందుకే గిరిజనులపై కేసులు నమోద వుతున్నాయనీ, పంట పొలాలను నాశనమవు తున్నాయని వివరించారు. - మిడియం బాబురావు