Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హుస్సేన్సాగర్లో వినాయక నిమజ్జనం కుదరదు
- జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు
- ఉత్తర్వులను సవరించబోమని స్పష్టీకరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వినాయక విగ్రహాల నిమజ్జనంపై తీర్పును సవరించాలని జీహెచ్ఎంసీ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను సోమవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ వినోద్కుమార్ల ధర్మాసనం కొట్టేసింది. నిమజ్జనంపై గత వారం ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలన్న లంచ్ మోషన్ పిటిషన్ను సోమవారం విచారించింది. గత తీర్పును తిరిగి పరిశీలించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. తీర్పులోని నాలుగు అంశాలను సవరించాలంటూ చేసిన వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. హుస్సేన్ సాగర్, ఇతర జలాశయాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ (పివోపి) విగ్రహాల నిమజ్జనంపై విధించిన నిషేధం ఎత్తివేయాలనీ, ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలనీ, హుస్సేన్ సాగర్లో రబ్బరు డ్యాం నిర్మించి దానిలోనే నిమజ్జనం చేయాలనే గత తీర్పులోని ఉత్తర్వులను సవరించాలని జీహెచ్ఎంసీ చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ట్యాంక్బండ్ వైపు నిమజ్జనానికి అనుమతించక పోతే విగ్రహాల నిమజ్జనం పూర్తి కావడానికి ఆరు రోజులు పడుతుందనీ, ఇది ఎన్నో వ్యయ ప్రయాసలతో కూడుకున్నదని జీహెచ్ఎంసీ తరఫున ప్రభుత్వ స్పెషల్ జీపీ హరేందర్ ప్రసాద్ వాదించారు. నగరవ్యాప్తంగా మండపాల్లో వేల సంఖ్యలో భారీ విగ్రహాలు ఉన్నాయనీ, సుమారు నాలుగు లక్షల వరకూ విగ్రహాలను ఏర్పాటు చేశారనీ, వీటిని హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిమజ్జనం చేసేందుకు చాలా కష్టం అవుతుందని ఆయన వివరించారు. విగ్రహాల సంఖ్యకు తగినన్ని నీటి కుంటలు లేవనీ, ఉన్న నీటి కుంటల్లో ఎత్తుగా ఉండే విగ్రహాలు పట్టవని చెప్పారు. పెద్ద విగ్రహాలు నీటి కుంటల్లో నిమజ్జనం చేయడం కష్టమన్నారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ వద్ద క్రేన్లు, ఇతర ఏర్పాట్లు చేశామనీ, వీటిని వేరే ప్రాంతాలకు తరలించటం కష్టమన్నారు. వీటన్నింటి కోసం నెలల క్రితమే ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు. ఇప్పటికిప్పుడు ప్రణాళికలు మార్చితే గందరగోళం తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిమజ్జనం తర్వత 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని చెప్పారు. భక్తులు, ప్రజలు మాస్కులు ధరించేలా చేస్తామనీ, కోవిడ్ గైడ్లైన్స్ను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ట్యాంక్బండ్పై నుంచి కూడా అన్ని రకాల విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు.
వాదనల అనంతరం హైకోర్టు నిమజ్జనంపై తాను తీర్పును సవరించేందుకు నిరాకరించింది. ఈ పరిస్థితులన్నీ ప్రభుత్వం సృష్టించుకున్నవేనని వ్యాఖ్యానించింది. సమస్యను గుర్తించి పరిష్కరిం చాల్సిన బాధ్యత అధికారులదేనని చెప్పింది. నీటి కుంటల్లో నిమజ్జనం వీలు కాదని గతంలోనే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించింది. తాము తీర్పు ఇచ్చాక ఇప్పుడు సమస్యల గురించి చెబుతారా? అని నిలదీసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2019లో ఇచ్చిన ఆర్డర్ ఇచ్చాకే కేంద్ర ప్రభుత్వ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పీవోపీలతో చేసిన విగ్రహాలను వాడొద్దనీ, నీటిలో నిమజ్జనం చేయవద్దని అన్ని రాష్ట్రాలకు చెప్పిందని గుర్తు చేసింది. ఈ సమస్య ఈ నాటిది కాదనీ, 2001 నుంచి ఉన్న ఈ సమస్యను ఇంకెన్నాళ్లు నాన్చుతారని ప్రశ్నించింది. బేబీ పాంటు ఏర్పాట్లు చేశామనీ, 25 వరకూ ఆ పాంట్లు ఉన్నాయని అఫిడవిట్ వేసి ఇప్పుడు అవి చాలవనీ, ఆ పాంట్ల దగ్గరకు వెళ్లడానికి దారులు ఇరుగ్గా ఉన్నాయంటూ కొత్త వాదనలు చేయడమేంటని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తీర్పు అమలుకు కరోనా అడ్డంకిగా మారిందని వాదన చేయడంలో అర్ధం లేదని వ్యాఖ్యానించింది. మల్లన్నసాగర్ ప్రారంభించేందుకు, వేర్వేరు పనులు చేసేందుకు కరోనా అడ్డం కానప్పుడు నిమజ్జనానికి ఎలా అవరోధం అవుతుందని నిలదీసింది. ఈ సారికి భక్తుల మనోభావాలను అర్ధం చేసుకోవాలని జిహెచ్ఎంసి కోరడాన్ని తప్పుపట్టింది. ఏ మత మనోభావాలనైనా ప్రజాహితంగా ఉండాలన్న విషయాన్ని మరిచిపోవద్దని తేల్చి చెప్పింది. చట్ట ప్రకారమే తీర్పు చెప్పామనీ, చట్టాన్ని అమలు చేస్తారా? లేదా? అనేది ప్రభుత్వ ఇష్టమని వ్యాఖ్యానించింది. జలాశయాలను కలుషితం చేసేందుకు తాము అనుమతి ఎలా ఇవ్వగలమని ప్రశ్నించింది. చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందని స్పష్టం చేసింది. చట్టాలను ఉల్లంఘిస్తారో, అమలు చేస్తారో ...అది ప్రభుత్వ ఇష్టమనీ, గత తీర్పులో జోక్యం చేసుకునేదేమీ లేదని తెలిపింది.