Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దొడ్డు ధాన్యం కొనబోమంటూ ప్రకటన
- డైలమాలో రాష్ట్ర సర్కారు సహా రైతాంగం
- వానాకాలం మధ్యలో ప్రత్యామ్నాయ పంటలేసుకోవాలా?
- తొలుత తేమ, తాలు పేరుతో ఎగనామం
- ఇప్పుడు ధాన్యమే కొనబోమంటూ బోర్డుతిప్పేసే ప్రయత్నాలు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
పుష్కలంగా నీళ్లు.. ఏ పంట పండించుకుందామన్నా.. రైతాంగం అంతా వరి సాగువైపే మొగ్గుచూపుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోనే 10లక్షల మెట్రిక్ టన్నులు కూడా సేకరించని ఎఫ్సీఐ ఇప్పుడు స్వరాష్ట్రంలో 90లక్షల మెట్రిక్ టన్నులు సేకరించింది. ఇప్పుడు 40లక్షల మెట్రిక్టన్నుల కంటే మించి ఒక్క ధాన్యంపు గింజను కూడా కొనలేమని స్పష్టం చేసింది. ఈ వానాకాలంలో కోటీ 40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయశాఖ అంచనా నేపథ్యంలో కేంద్రం తెచ్చిన కొర్రీతో రైతులు నిండా మునగనున్నారు. ఇప్పటికే తేమ, తాలు పేరుతో నాణ్యతా ప్రమాణాల్లో తీసుకొచ్చిన మార్పులు రైతన్న మెడకు ఉరితాడులా మారగా.. వర్షాకాలం మధ్యలో ఉండగా.. ఇప్పుడు అసలు దొడ్డు రకం ధాన్యమే కొనమంటూ కొర్రీ పెట్టడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది.
కేంద్రం దొడ్డురకం కొనబోమంటూ చేసిన హెచ్చరికలు రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం జలాలు, పుష్కలంగా వానలతో చెరువులు అలుగు దూకుతున్నాయి. వాగులు, వంకల్లో జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టులూ నిండుకుండలా ఉన్నాయి. అన్ని జిల్లాల్లోనూ రైతులంతా వరి సాగువైపే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో సుమారు 12లక్షల ఎకరాలకుపైగా సాగు విస్తీర్ణంలో 10లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అదీ ఏయేటికాయేడు పెరుగుతున్న సాగు విస్తీర్ణం, దిగుబడితో ఉమ్మడి జిల్లా నుంచే ఏకంగా 20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ క్రమంలో కేంద్రం తీసుకొచ్చిన ధాన్యం సేకరణ కొర్రీలతో రైతులు పెద్దఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది.
రైతన్నకు ఉచ్చు.. తేమ, తరుగు నిబంధనలు
ధాన్యంలో ప్రస్తుతం 17శాతం తేమ నిబంధనలను అడ్డుపెట్టుకుని ఇప్పటికే వ్యాపారులు రైతుల పంటను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఒక్కో బస్తాపై ఆరు నుంచి పది కిలోల వరకు తరుగు తీసి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు కేంద్రం ఆ తేమ శాతాన్ని 16శాతానికి కుదించడం వ్యాపారులకు మరింత కలిసొచ్చేలా తయారైంది. బియ్యంలో ఎర్రనూకలు 25శాతం నుంచి 20శాతానికి తగ్గించడం, రంగుమారిన, దెబ్బతిన్న గింజలను 5శాతం నుంచి 3శాతానికి కుదించడం, ధాన్యంలో తాలు, తప్ప, మట్టిగడ్డలను రెండు నుంచి ఒక శాతానికి తగ్గించడం రైతు మెడపై భారంగా మారాయి.
కనీస మద్దతూ నామమాత్రమే
దుక్కి దున్నింది మొదలు.. వారి నాట్లు, కలుపుతీత, వరికోత, రవాణా ఖర్చులు పెరిగిన నేపథ్యంలో క్వింటాలు ధాన్యం పండించేందుకు రూ.2758 వరకు ఖర్చవుతుందని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయితే, ఇటీవల ప్రభుత్వం పెంచిన క్వింటాల్పై మద్దతు రూ.72 కలిపితే రైతుకు మొత్తంగా రూ.1940మాత్రమే దక్కుతుంది. అదీ ఎలాంటి తాలూ, తర్రా లేని 'ఏ' గ్రేడ్ ధాన్యానికే వస్తుంది. ఈ నేపథ్యంలో మూడేండ్లుగా పెట్టుబడి కూడా మిగలని సాగులో చిన్న సన్నకారు రైతులు అప్పుల పాలవుతుంటే.. ఇటీవల కేంద్రం పెంచిన మద్దతు ధర కనీసం ఉపశమనం కూడా ఇవ్వడం లేదు.
కేంద్రం మొండిగా వ్యవహరిస్తోంది : పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
కేంద్రం రైతుల పట్ల మొండిగా వ్యవహరిస్తోంది. వానాకాలం మధ్యలో రైతులను ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ఎలా చెప్పగలం. కేంద్రం తీరు బాగోలేదు. వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. రాష్ట్రంలో వచ్చిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేయాలి.
రాష్ట్రం ఏర్పడిన ఏడేండ్లలో ఉమ్మడి జిల్లాలో వస్తున్న ధాన్యం దిగుబడి (లక్షల మెట్రిక్ లన్నుల్లో)
సంవత్సరం వానాకాలం యాసంగి మొత్తం
2014-15 11.03 13.24 24.27
2015-16 15.13 8.24 23.37
2016-17 16.47 37.21 53.68
2017-18 18.24 35.74 53.88
2018-19 40.41 37.05 77.46
2019-20 47.08 64.17 111.25
2020-21 48.82 90.40 139.22