Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక కోడ్లు రాకుండా అడ్డుకుని తీరుతాం
- అధికార యావతోనే బీజేపీ పాదయాత్ర
- సీఐటీయూది కార్మిక పక్షపాత యాత్ర
- కనీసవేతనాలు, కోడ్లపై బండి సంజరు ఎందుకు స్పందిచట్లేదు
- కార్మికుల ఇండ్లలోనే బస, వారు తినేదే మేం తింటున్నాం
- కార్మికగర్జన పాదయాత్ర బృంద సభ్యులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హంగూఆర్భాటాలు..రోజుకు లక్షలాది రూపాయల ఖర్చు..ఫార్చూన్, ఇన్నోవా కార్లతో కూడిన భారీ కాన్వారు...ఓ డీసీఎంలో పదుల సంఖ్యలో కెమెరాలు.. పెద్దపెద్ద టెంట్లు వేయించడాలు..అందులో ప్రత్యేకంగా నేతలు పడుకోవడానికి మంచాలు, పరుపులు.. క్యాటరింగ్ నుంచి భోజనాలు తెప్పించడాలు..ప్రత్యేక వైద్య బృందం..ఇదీ నేడు మెజార్టీ పాదయాత్రల్లో కనిపిస్తున్న దృశ్యం. అవి రాజకీయ ఆధిపత్యం, కుర్చీలాటలో ఓట్లు, సీట్ల కోసం జరుగుతున్నవే. ఇదే సమయంలో అందుకు భిన్నంగా రాష్ట్రంలో మరో పాదయాత్ర కొనసాగుతున్నది. పైన చెప్పినవేవీ ఈ యాత్రలో కనిపించవు. కనీస వేతనాల కోసం ఏలికలపై కొట్లాడేలా...కట్టుబానిసలుగా మార్చే కార్మిక కోడ్లు మాకొద్దు అని నినదించేలా కార్మికులను చైతన్యపరుస్తూ సీఐటీయూ కార్మిక గర్జన ముందుకెళ్తున్నది. ప్రతి కార్మికవాడనూ మీ కోసం వచ్చామంటూ ఈ యాత్ర తట్టిలేపుతున్నది. బృంద సభ్యులు ఎస్.వీరయ్య, పాలడుగు భాస్కర్, పి.విజయలక్ష్మి, భూపాల్ పేదల ఇండ్లలో నిద్రిస్తున్నారు. మున్సిపల్, గ్రామపంచాయతీ, పారిశ్రామిక కార్మికుల పెడుతున్న కలోగంజో తింటూ సాదకబాధలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటివరకూ సాగిన పాదయాత్రలో తనకు ఎదురైన అనుభవాలు, కార్మికుల నుంచి వస్తున్న స్పందన గురించి బృంద సభ్యులు ఎస్.వీరయ్య నవతెలంగాణతో పాలుపంచుకున్నారు. పూర్తి సారాంశం ఆయన మాటల్లోనే..
కార్మికులు ఐక్యం కాకుండా కుట్రలెన్నో..
ఐదురోజుల పాదయాత్రలో అడుగడుగునా కార్మికుల బాధలు, గోసలే కనిపించాయి. పరిశ్రమల్లో(అక్కడక్కడా ఒకటెండ్రు మినహా)యూనియన్లు లేవు. యాజమాన్యాలు బీహార్, యూపీ, ఒడిశా, తదితర రాష్ట్రాల కార్మికులను తీసుకొచ్చి 12 గంటల పనివిధానాన్ని నిర్బంధంగా అమలు చేస్తున్నాయి. వేతనాలైతే పదివేల రూపాయలకు మించిలేవు. బయటి వ్యక్తులు పరిశ్రమల్లోకి వెళ్లటం కష్టం. కార్మికులు దిక్కూదివానా లేనోళ్లు ఏం చేసినా చెల్లుతుందన్నట్టు యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. ఆ సంస్థల్లోనే పని చేస్తున్నట్టు ఎక్కడా రికార్డులు ఉండట్లేదు. ఎంత దారుణం! ఒకే కంపెనీ నాలుగైదు బినామీ కంపెనీలను సృష్టించి వాటిపేరుపై కార్మికులను పనిలోకి తీసుకుంటున్న పరిస్థితి. ఏమైనా అయితే మా కంపెనీ కార్మికుడివి కాదు. మాకేం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. కాటేదాన్లో ఓ కార్మికుడు పనిచేస్తుంటే కాల్జేతులు కాలాయి. మరో కార్మికడు ప్రమాదవశాత్తు పరిశ్రమలో మెట్లపై నుంచి పడటంతో తొంటి ఎముక విరిగిపోయింది. 2.5 లక్షల రూపాయల ఖర్చయిందంట. అతనికి 20 ఏండ్లు కూడా లేవు. ఆ ప్రమాదంతో భార్య, ఇద్దరు పిల్లలు రోడ్డునపడ్డారు. ఆ కుటుంబ భారం మహిళపై పడ్డది. అతనితో శ్రమ చేయించుకున్న కంపెనీయే పట్టన్నట్టు ఉంది. కొత్తోళ్లుఉద్యోగం ఇస్తరా? ఆ కుటుంబం బోరున విలపిస్తుంటే కండ్లల్లో నీళ్లు తిరిగినాయి. స్థానిక కార్మికులను పనిలో పెట్టుకుంటే వారికి స్థాన బలం ఉంటుంది. యూనియన్లు, హక్కులు అంటూ కంపెనీతో కొట్లాడుతారనే భయంతోనే పరిశ్రమలు వలసకార్మికులవైపు మొగ్గుచూపుతున్నాయి. వేర్వేరు రాష్ట్రాల కార్మికులు కావడంతో వారి మధ్య భాషా సమన్వయ లోపం కనిపించింది. ఏదైనా సమస్య వచ్చిన ప్పుడు ఒక్కతాటిపై నిలబడలేకపోతున్నారు. ఇది వారు ఐక్యం కాకుండా ఆటంకంగా ఉంది. పెట్రోల్బంకులు, హైవే అథారిటీలో పనిచేసే కార్మికుల వ్యథలు అన్నీఇన్నీ కావు. వీటిపై త్వరలో కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తాం.
'మెడలో ఆ మెడల్' ప్రత్యేకత ఏమిటంటే..
0ఎక్కువ పాలసీలు చేస్తే ఎల్ఐసీ ఏజెంట్కు మెడల్ ఇచ్చారంట. పాదయాత్ర బృందం అతనుండే కార్మికవాడలోకి పోగానే తెచ్చి మెడలో వేశారు. వేస్తూనే ''కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీని ప్రయివేటీకరించబోతున్నదంట గదా సార్. అది జరగొద్దు. ప్రజలకు నష్టం కలుగొద్దు. అందుకే ఈ మెడల్ను నీ మెడలో వేస్తున్నా. మెడలో ఉంటే మా ఎల్ఐసీ వాళ్ల బాధ లు మీకు అనుక్షణం గుర్తుకొస్తాయి. పోయిన ఊరికాడల్లా ఈ మెడల్ను చూపిస్తూ ఎల్ఐసీకి, ప్రజలకు జరగబోయే నష్టాన్ని చెప్పండి. పాదయాత్ర ముగిసే వరకూ దాన్ని మీ మెడలో నుంచి తీయొద్దు' అని హామీ కూడా తీసుకున్నాడు. అతనికిచ్చిన మాట ప్రకారం దాన్ని నా మెడలోనే వేసుకుని నడుస్తున్నా. బీమా రంగాన్ని ప్రయివేటీకరించే ఎత్తుగడ వెనుక ఉన్న కుట్రను కూడా ప్రజలకు వివరిస్తా.
మా యాత్ర భిన్నం..
పాదయాత్రల సందర్భంగా కార్పొరేట్లు, పరిశ్రమల యజ మానులు, కాంట్రాక్టర్లు వసతులు ఏర్పాటు చేయడం సర్వ సాధారణమే. మేం వాటికిదూరం. కార్మికులపక్షాన చేస్తు న్నాం కాబట్టే మాది భిన్నమైంది. కాంగ్రెస్, బీజోపోళ్లు సీఎం కుర్చీమీద యావతో చేస్తుంటే మేం మాత్రం ఐదేండ్ల కోసారి కార్మికులకు పెంచాల్సిన కనీసవేతనాల గురించి అడుగుతు న్నాం. ఇప్పుడున్న కార్మిక చట్టాలే పూర్తిస్థాయిలో కాకపోయి నా కొంతైనా రక్షణగా నిలుస్తున్నాయి. కొత్తగా కార్మిక కోడ్లు వస్తే యాజమాన్యాల కింద కట్టుబానిసలుగా బతకాల్సిందే. ఇలాంటి కోడ్లు వద్దనే ఈ యాత్ర చేస్తున్నాం. అందుకే కార్మికుల నుంచి అపూర్వ స్పందన కనిపిస్తున్నది.
పేదోళ్లిండ్లల్ల నేలపైనే బస... వారు పెట్టిందే తింటున్నాం
హంగూఆర్భాటాల్లేకుండా వెళ్లి కార్మికులను కలుస్తున్నాం. వారిండ్లలోనే బస చేస్తున్నాం. అవి చాలా ఇరుకైనవి. నలుగు రం సభ్యులమూ ఒకే చోట ఉంటే ఇబ్బంది. అందుకే ఒక్కొక్క రం ఒక్కోఇంట్ల బస చేస్తున్నాం. వారు పెట్టిందే తింటున్నాం. ''మీరు పెద్దోళ్లు బిడ్డ. అంతదూరం నుంచి మీరొస్తే మర్యాద చేయలేకపోతున్న. మాకు కుండలగల్గింది చేసి పెట్టిన బిడ్డా ఏమనుకోవద్దు'' అంటూ ఓ పారిశుధ్య కార్మికురాలు వేడివేడి అన్నంలో పప్పుచారు పోసి వడ్డించింది. ఆ కార్మికురాలి ఆప్యాయత మరువలేనిది. వినాయక చవితి ముందు రోజు మరో ఇంట్లో ఉన్నాం. భార్యాభర్తలిద్దరూ కాంట్రాక్టు కార్మికు లే. వారికిద్దరు పిల్లలు. ఆమె వంట చేశాక అందరమూ కలిసి తిన్నాం. ఆ తల్లి ఇంట్లో పనులన్నీ పూర్తిచేసుకునేసరికి రాత్రి 11 దాటింది. ఆర్డర్లు వస్తే వంట కూడా చేసిపెడ్తారంట. వినాయకచవితిరోజు ఆర్డరుంటే ఆమె మళ్లీ ఉదయం నాలుగింటికే లేచి పనులు మొదలుపెట్టింది. మేం లేచి ప్రెష్ అయ్యేసరికి టిఫిన్ చేసిపెట్టింది. కుటుంబానికి నెట్టుకురావడానికి మహిళా కార్మికులు అటు పనిప్రదేశాల్లో, ఇంట్లో పనులు చేయడం, పిల్లల బాగోలు చూసుకోవడం వల్ల వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో కండ్లకు కట్టినట్టు కనిపించింది. కార్మికులంతా నిరుపేదలే. అందులోనూ దళితులే ఎక్కువ. వారి ఇండ్లల్లో బసచేయడం వల్ల వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులు అర్థమవుతున్నాయి.