Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిషన్ భగీరథ ఈఎన్సీకి సీఐటీయూ వినతి
- పెండింగ్ వేతనాల కోసం రూ.50 కోట్లు విడుదల : ఈఎన్సీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న పంప్ ఆపరేటర్లు, లైన్మెన్స్, పిట్టర్లు, ఎలక్ట్రీషియన్లు, తదితర కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంజిరాల శ్రీనివాస్, వంగూరు రాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్లో మిషన్ భగీరథ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) కృపాకర్రెడ్డికి వారు మంగళవారం వినతిపత్రాన్ని అందజేశారు. మిషన్భగీరథ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించేందుకు రూ.50 కోట్లు విడుదల చేశామనీ, ఒకటెండ్రు రోజుల్లో వారి ఖాతాల్లో జమవుతాయని కృపాకర్రెడ్డి చెప్పారు. మిగతా పెండింగ్ సమస్యలు త్వరలో పరిష్కరిస్తామనీ, ఇక నుంచి ప్రతినెలా మొదటి వారంలోగా వేతనాలు చెల్లించేలా కంపెనీ అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. మిషన్ భగీరథ స్కీంలో పనిచేస్తున్న కార్మికులకు ఏడు నెలల బకాయి వేతనాలను చెల్లించాలనీ, ఇతర పెండింగ్ సమస్యల పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నెల ఆరోతేదీన ఈఎన్సీ కార్యాలయాన్ని ముట్టడించిన విషయం విదితమే. ఆ సమయంలోనే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి వేతనాల సమస్య పరిష్కరిస్తామని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సమక్షంలో కార్మికులకు ఉన్నతాధికారులు హామీనిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా బకాయి వేతనాల చెల్లింపు కోసం రూ.50 కోట్లు మంజూరు చేయటం పట్ల జంజిరాల శ్రీనివాస్, వంగూరు రాములు హర్షం వ్యక్తం చేశారు.