Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో తాజాగా 336 మందిలో కరోనా ఉన్నట్టు బయటపడింది. ఒకరు మరణించారు. మంగళవారం విడుదల చేసిన బులెటిన్లో పాజిటివ్ రేటు 0.43 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు 76,481మందికి టెస్టులు చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో 68,655 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 7,826 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 2,015 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,282 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా కోలుకున్న 306 మందిని డిశ్చార్జి చేశారు. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 96 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్ ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.
రంగారెడ్డిలో రెట్టింపైన కేసులు
రంగారెడ్డి జిల్లాలో సోమవారంతో పోలిస్తే మంగళవారం పాజిటివ్ కేసులు రెట్టింపయ్యాయి. జీహెచ్ఎంసీతో సహా మొత్తం 15 జిల్లాల్లో పెరుగుదల నమోదయింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, ములుగు, నల్లగొండ, నారాయణపేట, నిజామాబాద్, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కేసులు పెరిగాయి.
16 జిల్లాల్లో తగ్గిన కేసులు...
జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమురంభీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్ - మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్ధిపేట, వనపర్తి, వరంగల్ రూరల్ జిల్లాల్లో తక్కువగా నమోదయ్యాయి. జోగులాంబ గద్వాల, మహబూబాబాద్ జిల్లాల్లో వరసగా ఐదో రోజూ ఒక్క కేసు నమోదు కాలేదు.