Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రైళ్లు ఎక్కే సమయంలో జనరల్ టిక్కెట్ కౌంటర్ల వద్ద రద్దీ నివారణకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బయోమెట్రిక్ టోకెన్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఈశ్వరరావు దీన్ని ప్రారంభించారు. సికింద్రాబాద్ డివిజన్ డివిజినల్ రైల్వే మేనేజర్ ఏకె గుప్తా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్రిజర్వ్డ్ బోగీల్లో ప్రయాణించేవారికి ఈ సౌకర్యం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇదే తొలి యంత్రమని చెప్పారు. ఈ యంత్రం తొలుత ప్రతి ప్రయాణికుడి పేరు, రైలు నెంబరు, పీఎన్ఆర్ నెంబరు, వెళ్లవలసిన స్టేషన్ వంటి వివరాలను నమోదు చేస్తుంది. దీని తర్వాత ప్రయాణికుల బయోమెట్రిక్ సమాచారంలో భాగంగా వారి వేలి ముద్రలు, ఫొటోగ్రాఫ్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఈ యంత్రం అటోమెటిక్గా ఒక సీరియల్ నెంబరుతో టోకెన్ను ఇస్తుంది. ప్రయాణికులు తప్పనిసరిగా వారికి కేటాయించిన కోచుల ఆధారంగానే రైలు ఎక్కాలి. రైళ్లలో ఏవేని అనుకోని నేర సంఘటనలు జరిగితే ఈ బయోమెట్రిక్ వేలిముద్రలు, ఫోటోలు విచారణకు తోడ్పడుతాయని అధికారులు తెలిపారు. ప్రయాణికులు టోకెన్ పొందాకా వారి బోగీలోకి ప్రయాణ సమయానికి 15 నిమిషాలు ముందుగా చేరుకునే వెసులుబాటు దీనివల్ల కలుగుతుంది.