Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్కులు, ఉద్యానవనాల్లో కనీససౌకర్యాలు కచ్చితం : ఏ.శాంతికుమారి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జాతీయ పార్కులు, అటవీ ఉద్యాన వనాల్లో పర్యాటకులకు తగిన సౌకర్యాలు కల్పించాలనీ, ఆహ్లాదం పంచడంతో పాటు పర్యావరణ ప్రాధాన్యతను తెలిపేలా కార్యక్రమాలు రూపొందించాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం మృగవని జాతీయ ఉద్యానం వనం (చిలుకూరు), షామీర్ పేట జింకల పార్కును ఆమె సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటారు. మృగవని, అరణ్య రిసార్టులను పరిశీలించారు. నర్సరీలు, అటవీ పునరుద్ధరణ పనులతో పాటు సందర్శకుల సౌకర్యాలు, జంతువుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఏకో టూరిజం అభివృద్ధికి పలు సూచనలు చేశారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కు ఔటర్ రింగు రోడ్డు వెంట వేలాది ఎకరాల అటవీ భూములున్నాయనీ, వాటిల్లో అటవీ పునరుద్ధరణ పనులకు తోడు, సందర్శకులను అనుమతించిన పార్కులు, ప్రాంతాల్లో తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మృగవని నేషనల్ పార్కుకు వస్తున్న సందర్శకుల సంఖ్య, వసతులు, సఫారీలను పరిశీలించారు. ఐటీ కారిడార్ నుంచి వచ్చే ఉద్యోగులు, విద్యార్థులకు పర్యావరణం పట్ల అవగాహన పెరిగేలా కొత్త తరహా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. నేచర్ ట్రయల్స్, టెక్కింగ్, సైక్లింగ్, బర్డ్ వాచింగ్ లాంటి కార్యక్రమాలను సంబంధిత స్వచ్చంద సంస్థలతో కలిసి నిర్వహించవచ్చని తెలిపారు. చిలుకూరు సర్సరీని సందర్శించి, అక్కడ పెంచుతున్న మొక్కల రకాలపై ఆరాతీశారు. ఆ తర్వాత శామీర్ పేటలోని జింకల పార్కును అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానిక పరిసరాలకు తగిన మొక్కలను నాటి పెంచటం ద్వారా అటవీ ప్రాంతాల సహజవృద్ధికి అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ వైస్చైర్మెన్, ఎమ్డీ జి.చంద్రశేఖరరెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి చీఫ్ కన్జర్వేటర్లు ఎంజే. అక్బర్, సునితా భగవత్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.