Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరిపై సీఎం వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్
- రైతులకు వెన్నుపోటు పోడవడమే...
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'వరి వేస్తే ఉరి' అంటూ సీఎం కె చంద్రశేఖరరావు సోయిలేని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ టీపీసీసీ విమర్శించింది. గతంలోనూ సీఎం కేసీఆర్ అర్థంపర్థం లేని సూచనలు చేసి రైతులకు వెన్నుపోటు పోడిచారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వరిపై టీఆర్ఎస్ ప్రభుత్వ విధానమేంటో చెప్పకుండా రైతులను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించింది. మంగళవారం గాంధీభవన్లో ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీగౌడ్, అసెంబ్లీ మీడియాపాయింట్లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వేర్వేరుగా విలేకర్లతో మాట్లాడారు. గతంలో సన్నాలు వేయాలంటూ సీఎం కేసీఆర్ రైతులను మోసం చేశారని విమర్శించారు. అంతకు ముందు మక్కజొన్న వద్దని కూడా చెప్పి రైతులను నట్టేట ముంచారని గుర్తు చేశారు.ఇలాంటి చర్యల ద్వారా ఆధారపడి రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు టీఆర్ఎస్ విధానాలే కారణమని చెప్పారు. ఉచితంగా ఎరువులు, రుణమాఫీ ఇక్కడ చెప్పి... ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత సీఎం మాట మార్చారన్నారు. లక్షల కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రైతుల విషయంలో ప్రధాని నరేంద్రమోడీ, కేసీఆర్ నాటకాలాడుతున్నారని విమర్శించారు. అకాల వర్షంతో నష్టపోయిన పంటలకు ఇన్పుట్ సబ్సిడీ అందజేయాలని డిమాండ్ చేశారు. రెండు జీవనదుల ద్వారా గతంలో చేపట్టిన ప్రాజెక్టుల ఫలితంగానే పంటల సాగు పెరిగిందని భట్టి విక్రమార్క చెప్పారు. పంటలను మార్కెటింగ్ చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎలాగైతే ధాన్యం కొన్నామో, ఇప్పుడు కూడా అలాగే కొనాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ నిర్వహించిన దళిత బంధు సమీక్ష సమావేశంలో చాలా స్పష్టంగా తమపార్టీ వైఖరిని చెప్పామనీ, బయట కూడా అదే విషయాన్ని చెప్పామన్నారు. అన్ని విషయాలను కాంగ్రెస్ సమర్ధించినట్టుగా టీఆర్ఎస్ మీడియాకు పత్రిక విడుదల చేసిందని విమర్శించారు. 119 నియోజకవర్గ పరిధిలో దళిత కుటుంబాలకు రూ 10 లక్షలు ఇవ్వాలనీ, ఆ ప్రకారంగా 17 లక్షల కుటుంబాలకు రూ 1.70 లక్షల కోట్లు అవసరమవుతాయని చెప్పారు.
తెలంగాణలో ఆప్ఘన్ల పాలన నడుస్తున్నది : మహేశ్కుమార్గౌడ్
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా అక్కడ కాంగ్రెస్, ప్రతిపక్ష నాయకులను అరెస్టులు చేయిస్తున్నదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేశ్కుమార్గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలన తాలిబన్ల పాలనను తలపిస్తున్నదని ఆరోపించారు.48 గంటలకు ముందే నాయకులను అరెస్టులు చేయడమేంటని ప్రశ్నించారు. నియంత పాలన కొనసాగితే ప్రజలు తిరుగుబాటు చేయకతప్పదని హెచ్చరించారు.