Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వానాకాలంలో మధ్యలో ప్రకటించడం దారుణం
- పంజాబ్లో పూర్తి పంటను కొన్న ఎఫ్సీఐ
- రాష్ట్రంపై మాత్రమే ఎందుకు వివక్ష..?: మంత్రి గంగుల
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
'కేంద్రంలో బీజేపీ రైతు కష్టాన్ని ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో కోటీ 40లక్షల పంట దిగుబడి వస్తుంటే.. 60లక్షల మెట్రిక్ టన్నులకు మించి కొనబోమంటోంది. మిగతా పంటను ఏం చేసుకోవాలి..? బాయిల్డ్ రైస్ అసలే కొనబోమంటూ బోర్డు తిప్పేస్తోంది..' బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తన 'మీసేవా' కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రాన్ని ఒప్పించేందుకు రాష్ట్రంలోని బండి సంజరు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సహకరించాలని కోరారు. తాము పలుమార్లు ప్రధానిని, సంబంధిత శాఖల మంత్రులను కలిశామని, కావాలనే రాష్ట్రంపై వివక్ష చూపుతున్నారని అన్నారు. పంజాబ్లో పండిన కోటీ 13లక్షల మెట్రిక్ టన్నుల పూర్తి ధాన్యాన్ని కొన్న కేంద్రం.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 60లక్షల మెట్రిక్ టన్నులకు మించి కిలో కూడా కొనబోమనడం వివక్షకు అద్దం పడుతోందన్నారు. ఈ వానాకాలంలోనే 54లక్షల ఎకరాల్లో సాగవుతున్న వరి నుంచి సుమారు కోటీ 40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాబోతోందని, ఇందులో సగమే కేంద్రం కొంటే మిగతా పంట ఏం చేసుకోవాలని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాల్లో పీడీఎస్ అవసరాలకు వాడుకోగా.. మిగిలిన బియ్యాన్ని కొంటామని గతేడాది సెప్టెంబర్ 17న కేంద్రం ఒప్పందం చేసుకుందని గుర్తు చేశారు. 2020-21 యాసంగిలో 92.32లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైసుమిల్లులకు ఇచ్చామని, కేంద్రం ఎంఓయూ ప్రకారం బియ్యాన్ని మొత్తం తీసుకోవాలన్నారు. ఉచితంగా ఇస్తారో.. విదేశాలకు ఎగుమతి చేసుకుంటారో తమకు తెలియదని, తమ రాష్ట్ర రైతాంగం పండించే ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో ధాన్యం దిగుబడికి సరిపడా సామర్థ్యం ఉన్న మిల్లులు లేవని, అవి 24గంటలూ నడిస్తే తప్ప ఎఫ్సీఐకి బియ్యం అందించే పరిస్థితి లేదన్నారు. ఈ క్రమంలో ఎఫ్సీఐ అధికారులు ఆయా మిల్లుల్లో పరిశీలన పేరుతో 24 రోజులు బంద్ చేయించారని, ఆ మేరకు బంద్ చేయించిన గడువు అయినా ఇవ్వాలని అడిగితే అనుమతి ఇవ్వడం లేదన్నారు.