Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ- సూర్యాపేటటౌన్
రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్భవన్లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల మూలంగా ఇప్పటికే పంటకు గిట్టుబాటు ధర రాక రైతాంగం ఇబ్బందులు పడుతోందన్నారు. ఇప్పుడు పంటలనే కొనుగోలు చేయలేమని ప్రభుత్వాలు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. వరి పండించే భూముల్లో ఇతర పంటలు పండించే అవకాశం ఉండదన్నారు. ఒకవేళ వేరే పంట వేసినా దిగుబడి తక్కువగా వచ్చే అవకాశముందన్నారు. పైగా వరి పంట మీద ఆధారపడిన రైస్ మిల్లులు మూతపడితే అందులో పనిచేసే కార్మికులు రోడ్డున పడతారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వరి ధాన్యం కొనుగోలు చేసే విధంగా చూడాలని కోరారు. సాగర్, మూసీ ఆయకట్టు ప్రాంతంలో, కొన్ని ప్రాజెక్టుల కింద వరిని అధికంగా సాగు చేస్తున్నారన్నారు. గోదాముల్లో పంట నిల్వలు ఉన్నాయన్న పేరుతో ధాన్యం కొనుగోలు చేయబోమనడం సరికాదన్నారు. గోదాముల్లో పంట నిల్వలు ఉంటే.. తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్న పేదలందరికీ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దొడ్డు ధాన్యం కొనుగోలు చేయబోమని రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోబోమని హెచ్చరించారు. పంటలకు మద్దతు ధర కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, కోటగోపి, వేల్పుల వెంకన్న ఉన్నారు.