Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి
- వలస కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తున్న యాజమాన్యాలు
- కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలి : ఎస్.వీరయ్య
- వంద కిలోమీటర్లు పూర్తయిన సీఐటీయూ పాదయాత్ర
నవతెలంగాణ -భూదాన్పోచంపల్లి
కేేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధాలను మానుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ వీరయ్య కోరారు. సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక గర్జన పాదయాత్ర మంగళవారం భూదాన్ పోచంపల్లి మండలపరిధిలో దోతిగూడెం గ్రామానికి చేరుకుంది. పాదయాత్ర వంద కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పాదయాత్ర బృందం మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఏడేండ్లు గడుస్తున్నా కనీస వేతన చట్టాలను మరిచిందన్నారు. ప్రభుత్వాలు యజమానులతో కుమ్మక్కై చట్టాలను కాలరాస్తున్న పరిస్థితి ఉందన్నారు. మండల పరిధిలోని దోతిగూడెం గ్రామంలో సుమారు ఏడు కంపెనీలలో 3500 మంది కార్మికులు వివిధ రాష్ట్రాల నుండి వచ్చి పని చేస్తున్నారన్నారు. వారికి కనీస వేతన చట్టం ద్వారా అయితే రూ. 464 కోట్లు కార్మికులకు చెందేవి అని వివరించారు. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో 25 వందల మంది కార్మికులు వివిధ కంపెనీల్లో పనిచేస్తున్నారని, చట్టం అమలుకాకపోవడం వల్ల రూ. 269 కోట్లు కార్మికుల నడ్డి విరిచి యజమాన్యాలు దోచుకు తింటున్నాయని విమర్శించారు. ప్రతి కార్మికునికీ రూ.21వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలు రద్దుచేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేసిందన్నారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసేలా వ్యవహరించిందన్నారు. పోచంపల్లి మండలం పరిధిలోని ఉన్న రసాయన పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా యాజమాన్యాలు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ ఒడిశా. బీహార్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయని అన్నారు. ఒక్కొక్క ఇంట్లో 10 నుంచి 12 మంది కార్మికులను ఉంచి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని... ప్రమాదాలు జరిగితే గుట్టుచప్పుడు కాకుండా శవాలను తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్టిమస్ కంపెనీలో కార్మికులను యూనియన్ పెట్టనీయకుండా భయపెడుతున్నారని విమర్శించారు. ఎస్వీఆర్ లాబరేటరీలో రియాక్టర్లు తేలిన పరిస్థితి ఉందన్నారు. కాలుష్య పరిశ్రమల నుంచి నిబంధనలకు విరుద్దంగా విషవాయువులను వదులుతున్నా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, మంత్రుల వేతనాలు పెంచుకున్నారు తప్ప షెడ్యూల్ పరిశ్రమల కార్మికుల వేతనాలు మాత్రం ఒక్క పైసా కూడా పెంచలేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 68 రంగాలకు కనీస వేతన చట్టం అమలు చేయాలని సీఐటియూ ఆధ్వర్యంలో కార్మికులను ఐక్యం చేయడం లక్ష్యంగా పాదయాత్రను చేపట్టిందన్నారు. ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామన్నారు. సమ్మె చేయడానికి వెనకాడబోమని అన్నారు. పాదయాత్ర బృందంలో భూపాల్ విజయలక్ష్మి, పాలడుగు భాస్కర్, మల్లికార్జున్ కూరపాటి రమేష్ సిఐటియు జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి దాసరి పాండు రైతు సంఘం నాయకులు గూడూర్ అంజి రెడ్డిపగిళ్ల లింగారెడ్డి కోట రామచంద్రారెడ్డి గడ్డ వెంకటేశం మంచాల మధు పగడాల శివ ప్రసాదం విష్ణు తదితరులు పాల్గొన్నారు. ్శ మల్లు నాగార్జునరెడ్డి, నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, కోటగోపి, వేల్పుల వెంకన్న ఉన్నారు.