Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేతనాల పెంపునకు ఓకే
- యాజమాన్యంతో కార్మిక సంఘాల ఒప్పందం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
పంజాబ్ ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికులు విజయం సాధించారు. పది రోజుల సమ్మెతో యాజమాన్యాలు దిగొచ్చాయి. వారికి వేతనాలు పెంచేందుకు అంగీకరించాయి. పోరాటాన్ని విజయవంతంగా ముగించినందుకు అఖిల భారత మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) ప్రధాన కార్యదర్శి కెకె దినకరన్ కార్మికులకు అభినందనలు తెలిపింది. పంజాబ్ ఆర్టీసీ, పన్బస్ కార్పొరేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు వేతనాలు పెంచాలనీ, సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ దశలవారీగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నారు. యాజమాన్యాలు స్సందించకపోవడంతో పది రోజుల క్రితం సమ్మెలోకి వెళ్లారు. ఎక్కడికక్కడ బస్సుల్ని నిలిపివేశారు. దీనితో రెండు కార్పొరేషన్ల అధికారులు వారిని చర్చలకు ఆహ్వానించారు. పలు దఫాలు జరిగిన చర్చలు ఎట్టకేలకు మంగళవారం సఫలమయ్యాయి.
ఇవీ విజయాలు..
- పంజాబ్ ఆర్టీసీలో కాంట్రాక్ట్ కండక్టర్ల వేతనం రూ.9 వేలు, పన్బస్ కండక్టర్లకు రూ.10వేలుగా ఉంది. రెండు చోట్లా వీరి వేతనాన్ని రూ.17వేలకు పెంచేలా యాజమాన్యాలు అంగీకరించాయి. ఆ మేరకు కార్మిక సంఘాలతో ఒప్పందం చేసుకున్నాయి.
- పంజాబ్ ఆర్టీసీ కాంట్రాక్ట్ డ్రైవర్ వేతనం రూ.10,500, పన్బస్ కాంట్రాక్ట్ డ్రైవర్ వేతనం రూ.12వేలుగా ఉంది. రెండు చోట్లా వీరి వేతనాన్ని రూ.18వేలకు పెంచేలా ఒప్పందం కుదిరింది.
- పెరిగిన వేతనాలన్నీ సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయి.
- క్లీన్ రికార్డ్ ఉండి, పదేండ్ల సర్వీస్ పూర్తయిన కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేసేందుకు యాజమాన్యాలు అంగీకరించాయి. సీనియారిటీ లిస్ట్ తయారీ, స్క్రూటినీ కోసం నెలరోజుల గడువును కోరాయి. దానికి కార్మిక సంఘాలు అంగీకరించాయి.
- కార్మికులందరికీ ఐదు శాతం వార్షిక ఇంక్రిమెంట్ ఇచ్చేందుకూ ఒప్పందం కుదిరింది.
- సమ్మె సమయంలో కార్మికులపై పెట్టిన కేసులు ఉపసంహరిం చుకొనేందుకు అంగీకారం కుదిరింది.
- ఒప్పంద నేపథ్యంలో కార్మికులు సమ్మెను మంగళవారం మధ్యాహ్నం నుంచి ఉపసంహరించుకున్నారు.