Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఆర్సీ నిబంధనలే గీటురాయి
- పాత రహదారుల నిర్వహణనూ మెరుగుపరుస్తున్నాం
- ప్రణాళిక, అమలు ఇంజినీర్ల బాధ్యత
- ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తేనే ఫలితాలు
- పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎ.జి సంజీవరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
''రాష్ట్రంలో గత ఏడేండ్లుగా రూ.7128 కోట్లతో పంచాయతీరాజ్ రోడ్లు, బ్రిడ్జిలు, భవనాలు నిర్మించాం...ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనలే గీటురాయి..వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు..ఇప్పటికే ఒక దఫా ప్రతిపాదనలు పంపాం..పీఎంజీఎస్వై ప్రాజెక్టులను వేగంగా చేపడుతున్నాం..అటవీప్రాంతాల్లో వన్యప్రాణు లకు నష్టం జరగకుండా జాగ్రత్తలు..ప్రమాణాల మేరకే రోడ్లు,బ్రిడ్జిలను నిర్మిస్తున్నామని' రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎ.జి సంజీవరావు అన్నారు. బుధవారం ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టిన రోజున ఇంజినీర్స్ డే జరుపుకుంటున్న నేపథ్యంలో నవతెలంగాణ ప్రతినిధి బి.బసవపున్నయ్యకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖలో ప్రస్తుత కార్యకలాపాలు ఎలా ఉన్నాయి ?
ప్రస్తుతం తమ శాఖ పరిధిలో గ్రామీణ రోడ్ల నిర్మాణం, నిర్వహణ, నాభార్డు, పీఎంజీఎస్వై పథకాలు అమలుచేస్తున్నాం. రోడ్ల నిర్మాణంతోపాటు నిర్వహణా చేపడుతున్నాం. రోడ్లే కాకుండా బ్రిడ్జిలు, కల్వర్టులు నిర్మిస్తున్నాం. ప్రకృతి వైఫరీత్యాల సందర్భంగా ఎదురయ్యే సమస్యలనూ పరిష్కరిస్తున్నాం. ప్రజలకు మంచి రోడ్ నెట్వర్క్ను అందించడమే తమ లక్ష్యం.
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి ?
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ రోడ్ల నిర్మాణంతోపాటు నిర్వహణను చేపడుతున్నది. నాభార్డు నిధులతో అవసరమైన చోట బ్రిడ్జిలను కడుతున్నాం. నిబంధనలను కచ్చితంగా అమలుచేస్తున్నాం. రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకు రూ. 23,243 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించాం. 440 బ్రిడ్జిలు, 154 భవనాలు కట్టాం. ఈ పనులను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖకు వచ్చే సాధారణ నిధులతోనే చేశాం. ఈ ఏడేండ్ల కాలంలో రూ.7128 కోట్ల విలువగల పనులు చేపట్టాం.
ప్రమాణాల అమలు సరిగ్గా లేదనే విమర్శలు వస్తున్నాయి కదా ?
నో.నో అలాంటిదేమీ లేదు. రాష్ట్రంలో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనలే అమలుచేస్తున్నాం. ఎక్కడా రాజీపడటం లేదు. కాంట్రాక్టర్లకు సరైన ప్రణాళిక(డిజైన్)ను ఇచ్చి అమలుచేయించే ప్రయత్నం చేస్తున్నాం. సమన్వయంతోనే ముందుకుపోతున్నాం.
పీఎంజీఎస్వై ప్రాజెక్టుల సంగతేంటి ?
పీఎంజీఎస్వై-1 పనులు పూర్తయ్యాయి. పీఎంజీఎస్వై-2 పనులు కొత్తగా మంజూర య్యాయి. పీఎంజీఎస్వై-3 ద్వారా 356 రోడ్లు, 100 బ్రిడ్జిలు వచ్చాయి. ప్రజలకు మంచి రహదారి సౌకర్యాన్ని అందించే ఉద్దేశ్యంతో పనిచేస్తున్నాం. ఈ ఏడాది 2395 కిలోమీటర్లకుగాను 1000 కిలోమీటర్ల మేర పీఎంజీఎస్వై రోడ్ల పనులు పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాం. 2017 నుంచి ఇప్పటివరకు 620 రోడ్లు, 231 బ్రిడ్జిలకు టెండర్లు పిలిచాం. వీటికోసం రూ. 2459 కోట్లు వచ్చాయి. ఇందులో రకరకాల కారణాల మూలగా 25 రోడ్లు, 23 బ్రిడ్జిలకు ఐదారుసార్లు పిలిచినా టెండర్లు రాలేదు.
కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదనే ఆరోపణలూ ఉన్నాయి కదా ?
అలాంటిదేమీ లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్మించిన పంచాయతీరాజ్ రోడ్లు అన్నింటికీ బిల్లులు చెల్లించాం. సాధారణ బకాయిలే ఉన్నాయి.
ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్నరోడ్ల మరమ్మతులు చేస్తారా ?
అవును. తప్పకుండా చేస్తాం. ఇప్పటికే ఒక దఫా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. రెండో దఫా పంపేందుకు సన్నద్ధమవుతున్నాం. తాత్కాళిక మరమ్మతుల కోసం రూ. 14.07 కోట్లు, శాశ్వత మరమ్మతుల కోసం రూ.139.58 కోట్లు అవసరమున్నాయి. 253 రోడ్లు, 326 కల్వర్టులు దెబ్బతినగా, మరో 179 రోడ్లకు గండ్లుపడ్డాయి.
అటవీప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం ఆలస్యమవుతున్నదెందుకు ?
జాప్యమేమీ లేదు. అడవుల్లో వన్య ప్రాణుల సంచారానికి, వాటి జీవనానికి ఎలాంటి ఇబ్బంది కలగ కుండా రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ఇది సున్నితమైన విషయం. ఈమేరకు రాష్ట్ర, జాతీయ వన్యప్రాణీ బోర్డులు అనుమతులు కావాలి. అటవీ భూములకు బదులు మరోచోట ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాలి. మళ్లీ చెట్లు పెంచడానికి నిధులు కేటాయించాలి. ఈ ప్రక్రియ అంతా పూర్తికావడానికి సమయం పడుతుంది. అంతేతప్ప మరే ఇతర కారణమూ కాదు.
ఇంజినీర్స్ డే సందర్భంగా ఇంజినీర్లకు మీరిచ్చే సందేశం ?
మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరుమోసిన ఇంజినీర్. ఆయన పుట్టినరోజును ఇంజినీర్స్ డే జరుపుకుంటున్నారు. ప్రజల కోసం ఆయన చేసిన సేవలు ఎనలేనివి. తక్కువ సొమ్ముతో ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చడం ఆయన మోటో. ఇప్పటి ఇంజినీర్లకు నేను చెప్పేది ఒక్కటే ప్రణాళిక, అమలు చాలా కీలకం. అంకితభావంతో పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. తద్వారా ప్రజలకు సేవచేసిన వాళ్లమవుతాం.