Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత బంధు, అసెంబ్లీ సమావేశాలపై ప్రధాన చర్చ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో దళిత బంధు పైలెట్ ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చించనున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకం ఇప్పటికే అమలవుతున్న సంగతి తెలిసిందే. దాంతోపాటు రాష్ట్రంలోని మరో నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో కూడా దీన్ని అమలు చేయాలని సీఎం నిర్ణయించిన నేపథ్యంలో... సంబంధిత విధి విధానాలపై మంత్రివర్గం చర్చించనుంది. ఆ తర్వాత మార్గదర్శకాలను విడుదల చేయనున్నారని సమాచారం. ఈనెల 25లోపు శాసనసభ, శాసనమండలి సమావేశాలను నిర్వహించాల్సి ఉన్నందున సంబంధిత తేదీలపై కూడా క్యాబినెట్ చర్చించనుంది. ఉభయ సభలను ఎన్ని రోజులు నిర్వహించాలి..? ఏయే అంశాలను అజెండాలోకి తీసుకోవాలనే విషయాలపై సీఎం ఆ సందర్భంగా మంత్రులతో సమాలోచనలు చేయనున్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో శాసనమండలికి పంపేందుకు సీఎం నిర్ణయించారు. కానీ గవర్నర్ తమిళి సై ఆ అంశాన్ని పక్కకుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై సీఎం మరోసారి మంత్రులతో చర్చించి, ఆ తర్వాత గవర్నర్ను కలవనున్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం రకరకాల రూపాల్లో మోకాలడ్డుతున్న నేపథ్యంలో ఆ సమస్యను కూడా ఎలా పరిష్కరించాలనే దానిపై కేసీఆర్ సమాలోచనలు చేయనున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి.