Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తాం
- రిలే నిరాహార దీక్షలో గిరిజన సంఘాల హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చిన్నారి చైత్రపై లైంగిక దాడి చేసి హత్యచేసిన నిందుతున్ని శిక్షించాలనీ, లేదంటే గిరిజన శాఖ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తామని గిరిజన సంఘాలు హెచ్చరించాయి. ఈ ఘటనకు నిరసనగా మంగళవారం హైదరాబాద్లోని సింగరేని కాలనీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరహారదీక్షలు జరిగాయి. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్.శ్రీరాంనాయక్, తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ అంజయ్య నాయక్, సర్వోదయ మండలి రాష్ట్ర అధ్యక్షులు శంకర్నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ గణేష్నాయక్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ బంజారా, సేవలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు నాయక్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎం బాలునాయక్, గిరిజన నాయకులు చందునాయక్, ప్రదేశ్ ఎరుకుల హక్కుల సంఘం బి.రఘు, సింగరేణి స్థానిక నాయకులు కిషన్ నాయక్, శంకర్ లాల్, దశ్రునాయక్, షేక్ మహమ్మద్, అశోక్ రాథోడ్, సంతోష్, భరత్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ రాం నాయక్ మాట్లాడుతూ చైత్రపై లైంగిక దాడిచేసి హత్యచేసిన నరహంతకుడిని పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దిశ సంఘటనలో ప్రభుత్వం స్పందించిన తీరుకు, గిరిజన బాలిక చైత్రబాయి సంఘటన పట్ల స్పంధించిన తీరుకు చాలా తేడా ఉందని అన్నారు. ఈ సంఘటన పైసర్కార్ ఎందుకు స్పంధించటం లేదని ప్రశ్నించారు. ధనవంతులకో న్యాయం, గిరిజన, దళిత, బలహీన వర్గాలకో న్యాయమా? అని ప్రశ్నించారు. సంఘటన జరిగి ఆరు రోజులు అవుతున్నా నిందితుడు రాజును పట్టుకోవటంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. గిరిజన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు కనీసం పరామర్శించడానికి కూడా రాకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిందితుణ్ని అరెస్టు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ పూర్తి చేస,ి కఠినంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిలే నిరాహార దీక్షలో భాగంగా గిరిజన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల ఫొటోలతో గిరిజనుల సంప్రదాయం ప్రకారం శవ యాత్ర చేసి తమ నిరసనను తెలిపారు.