Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్ అండ్ బీ ఇంజినీర్ల పాత్ర అద్వితీయం
రాష్ట్రంలో ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అద్భుతమైన కట్టడాలతో ఆకర్షిస్తున్నాయి. ఎన్నో ఏండ్ల నుంచి కలగా మిగిలిన ప్రాజెక్టులు కార్యరూపం దాల్చు తున్నాయి. కొన్ని నెలల వ్యవధిలోనే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తికానున్నాయని ఈఎన్సీ గణపతిరెడ్డి తెలిపారు.
దళిత్ స్టడీస్ సెంటర్ నిర్మాణం
హైదరాబాద్ నగరంలోని యూసుఫ్గూడలోని బి-బ్లాక్లో సర్వేనెంబర్ 1/11లో దళిత్ స్టడీస్ భవనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.26.10 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నది. దళితుల జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు వారి అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారు.
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనలో భాగంగా దళితుల స్వావలంభనతో పాటు వారి సాధికారత కోసం కృషి చేస్తున్నారు. ఎన్టీఆర్ గార్డెన్ ఆవరణలో లక్ష 125 అడుగులు అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పనులు ప్రారంభించింది. దీని నిర్మాణం కోసం రూ.146.50 కోట్లు కేటాయించింది. త్వరలో దీన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇంటిగ్రేడెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పోలిసింగ్ వ్యవస్థలో పెను మార్పులు వచ్చాయి. పోలీసింగ్ వ్యవస్థ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తున్నది. బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ 12లో అద్భుతమైన హంగులతో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవనాన్ని మరియు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నది. దీని నిర్మాణం కోసం రూ.585.00 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. దీని యొక్క నిర్మిత విస్తీర్ణం 5.08 లక్షల చదరపు అడుగులు. పూర్తి వ్యయం రూ.429.31 కోట్లు. దీని యొక్క అంతర్గత నిర్మాణ పనులు ప్రస్తుతం కొన సాగుతు న్నాయి. చైర్మన్ గది మరియు ఎలివేషన్ పనుల నిర్మాణం మాత్రమే మిగిలి వున్నాయి. మిగతా పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. త్వరలో ఈ భవనాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.
మల్టీపర్పస్ కాంప్లెక్స్
నాంపల్లిలో అనీసుల్ గుర్బాలో మల్టీపర్పస్ కాంప్లెక్స్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దీని నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.39.00 కోట్లు ఖర్చు చేస్తున్నది. దీని యొక్క నిర్మిత ప్రదేశ విస్తీర్ణం 1.46 లక్షల చదరపు అడుగులు. దీని నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి.
తెలంగాణ ప్రెస్ అకాడమి భవనం
తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాత జర్నలిస్టులను అన్ని రకాలుగా ఆదుకున్నది. తెలంగాణ స్టేట్ ప్రెస్ అకాడమి బహుళ అంతస్తుల భవనాన్ని నాంపల్లిలో నిర్మిస్తున్నది. దీని నిర్మాణం కోసం రూ.15కోట్లు కేటాయించింది. దీని నిర్మిత ప్రాంతం 29500 చదరపు అడుగులు. దీని నిర్మాణం పూర్తయింది. ప్లాస్టరింగ్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
అమరవీరుల కుటుంబాలకు బాసటగా సర్కార్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు బాసటగా నిలిచింది. అమరవీరుల సంస్మరణార్థం టాంక్బండ్ వద్ద ఉన్న లుంబినీ పార్కుకు సమీపంగా తెలంగాణ అమరవీరుల స్మృతి వనాన్ని నిర్మిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమర వీరుల త్యాగాలను ప్రతిబింబిం చేలా నిర్మాణం కొనసాగుతున్నది. దీని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.80 కోట్ల నిధులు కేటాయించింది. దీని యొక్క నిర్మిత ప్రదేశ విస్తీర్ణం 295000 చదరపు అడుగులు. సివిల్, నిర్మిత స్టీల్ పనులు పూర్తయ్యాయి. ఫ్లోరింగ్, పెయింటింగ్ పనులతో పాటు అంతర్గత పనులు కొనసాగుతున్నాయి.
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణాలు
రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల భవనాల నిర్మాణాలను ప్రభుత్వం చేపడుతున్నది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోటకు చేర్చాలనే ధృడ సంకల్పంతో పాటుగా పారదర్శక పాలన అందించాలనే ధ్యేయంతో ప్రభుత్వం వీటి నిర్మాణాలను చేపడుతున్నది. పౌర సేవలను వేగవంతం చేస్తున్నది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవనాలకు విశేష ఆదరణ లభిస్తున్నది. వీటి నిర్మాణం కోసం రూ.1365.62 కోట్లు కేటాయించింది. 25జిల్లాల్లో వీటి పనులు కొనసాగుతున్నాయి. కలెక్టర్ల, అదనపు కలెక్టర్లు, డీఆర్వోల భవనాల నిర్మాణం కోసం రూ.167.89 కోట్లు కేటాయించింది. తొలివిడతలో 20జిల్లాల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రోడ్లు భవనాల శాఖ మూడు ఐడీఓసీల కోసం కరీమ్నగర్ వద్ద రూ.51 కోట్లు, నారాయణ్పేట్, ములుగు జిల్లాల కోసం రూ.55 కోట్ల చొప్పున కేటాయించింది. నారాణయణ్పేట్, ములుగు జిల్లాల్లో రెసిడెన్షియల్ క్వార్టర్ల కోసం రూ.8.50 కోట్ల చొప్పున కేటాయించింది. ఆదిలాబాద్లోనూ రూ.55 కోట్ల నిధులతో దీని నిర్మాణం చేపట్టేందుకు ఐడీఓసి ప్రతిపాదన పంపించింది. జిల్లా కలెక్టర్ల భవనం నిర్మాణం కోసం 6000 చదరపు అడుగుల ఫ్లింత్ ఏరియాను, అదనపు జిల్లా కలెక్టర్ల భవనం నిర్మాణం కోసం 3000 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం ఏర్పాటు చేసింది.
ఇంజినీర్ల పాత్ర అద్వితీయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పలు భవనాలు, కట్టడాల్లో ఇంజినీర్ల పాత్ర అద్వితీయమని రోడ్లు, భవనాల శాఖ ఈఎన్సీ గణపతి రెడ్డి తెలిపారు. ఇంజినీర్ల దినోత్సవం సందర్భంగా ఆయన ఇంజినీర్లకు శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంజినీర్లకు సముచిత గౌరవం ఇస్తున్నది అన్నారు. జాతి నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న పలు కట్టడాలు ఇతర రాష్ట్రాలకు దిక్చూచిగా మారాయని అన్నారు.