Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్
- అత్యున్నతస్థాయి కమిటీ ఏర్పాటు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా వల్ల ప్రయాణాలు తగ్గడంతో హైదరాబాద్ మెట్రో ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిందనీ, ఆ సంస్థను ఆదుకునేందుకు ఉన్న అవకాశాలను అన్వేషిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఆర్థికంగా నష్టపోతున్న తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎల్ అండ్ టి కంపెనీ ఉన్నతాధికారులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో, కరోనా కష్టాలను అధిగమించి మెట్రో తిరిగి గాడిలో పడేలా ప్రభుత్వం సహకరిస్తుందని ఎల్ అండ్ టి ఉన్నతాధికారులకు సీఎం హామినిచ్చారు. మంగళవారం ప్రగతి భవన్లో ఎల్ అండ్ టి ఉన్నతాధికారులు సీఎం కేసిఆర్తో భేటి అయ్యారు. కరోనా కాలంలో మెట్రో ఎదుర్కోంటున్న ఆర్థిక నష్టాలను, బ్యాంకు అప్పులు, రోజురోజుకు పేరుకుపోతున్న వడ్డీల వివరాలను సమావేశంలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అనతి కాలంలోనే సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా హైదరాబాద్ మెట్రో సేవలందిస్తూ ప్రజాదరణ పొందిందన్నారు. కరోనా పరిస్థితులు అన్ని రంగాలను ప్రభావితం చేసినట్లే మెట్రోను కూడా ఇబ్బందుల్లోకి నెట్టిందని తెలిపారు. హైదరాబాద్ నగరానికి మెట్రో సేవలు ఎంతో అవసరమనీ, భవిష్యత్తులో దాన్ని మరింతగా విస్తరించాల్సి ఉందన్నారు. కరోనా దెబ్బతో మెట్రో అప్పుల్లో కూరుకుపోవడం, వడ్డీలకు వడ్డీలు కట్టాల్సి రావడం శోచనీయమన్నారు. ఎలాంటి విధానాలు అవలంభించడం ద్వారా మెట్రోకు మేలు చేయగలుగుతామో విశ్లేషిస్తామని తెలిపారు. సాధ్యాసాధ్యాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. కరోనా వంటి క్లిష్ట సందర్భాల్లో వినూత్నంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. హైదరాబాద్ మెట్రోను ఆదుకోవడంతో పాటు అది తిరిగి పుంజుకుని ప్రజావసరాల కోసం మరింతగా విస్తరించే దిశగా చర్యలు చేపడతామని సిఎం తెలిపారు. ఇందుకు గాను చర్చించి పుర్వాపరాలను పరిశీలించి ఏ విధానాలు అవలంభించడం ద్వారా మెట్రోకు పూర్వవైభవాన్ని తీసుకురాగలమో అవగాహన కోసం ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
కమిటీలో.....
ఈ కమిటీలో మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు, రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకష్ణారావు, ఎంఎయూడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఉంటారని సీఎం తెలిపారు. మెట్రోను నష్టాలనుంచి రాష్ట్ర ప్రభుత్వం తనవంతు బాధ్యతగా ఆదుకునే అంశంపై అన్ని రకాలుగా పరిశీలించి అధ్యయనం చేసి అతి త్వరలో నివేదిక అందించాలని కేసీఆర్ ఆదేశించారు. సమావేశంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.