Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ చట్టాలు రద్దయ్యేదాకా ఐక్యఉద్యమం
- అబద్ధాలను ప్రచారం చేస్తున్న ప్రధాని
- అంబానీ, అదానీ ప్రయోజనాలే మోడీకి ముఖ్యం
- కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి : బెఫీ వెబినార్లో ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్మొల్లా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైతుల కోసమే కాకుండా దేశం కోసం, ప్రజల కోసం, వ్యవసాయరంగ పరిరక్షణ కోసం ఈనెల 27న భారత్బంద్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ప్రధాన కార్యదర్శి హన్నన్మొల్లా అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలు రద్దయ్యేంత వరకూ ఐక్యఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బెఫీ) ఆధ్వర్యంలో 'దేశంలో రైతాంగ ఉద్యమాలు'అనే అంశంపై మంగళవారం వెబినార్ జరిగింది. ఈ సందర్భంగా హన్నన్మొల్లా మాట్లాడుతూ ఈనెల 26 నాటికి రైతు ఉద్యమం ప్రారంభమై పది నెలలు పూర్తవుతుందని చెప్పారు. ఐక్యంగా సాగుతున్న ఈ ఉద్యమం శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా అంతర్జాతీయ గుర్తింపు పొందిందని అన్నారు. స్వాతంత్య్రం తర్వాత ఇంత సుదీర్ఘమైన పోరాటం జరగలేదన్నారు. కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు ఈనెల 27న భారత్బంద్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని వివరించారు. మూడు వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు మేలు కలుగుతుందనీ, దేశంలో ఎక్కడైనా ఆహార ధాన్యాలను అమ్ముకోవచ్చంటూ సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ చట్టాలు అమలైతే అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లు వ్యవసాయంపై పెత్తనం సాగుతుందని చెప్పారు. రైతులు సొంత భూమిలో వ్యవసాయ కార్మికులుగా మారిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ కమిటీలు రద్దయి కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి పోతాయని అన్నారు. ఆహార ధాన్యాలను ఎంతైనా నిల్వ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. కార్పొరేట్ సంస్థలు బ్లాక్మార్కెట్ చేసి ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతాయన్నారు. ప్రభుత్వ నియంత్రణ ఉండబోదని స్పష్టం చేశారు. దీంతో రైతులే కాకుండా ప్రజలు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఎఫ్సీఐ రద్దవుతుందనీ, ఆహార భద్రతకు ప్రమాదం వస్తుందన్నారు. రేషన్దుకాణాలు ఉండబోవనీ, పేదలు ఆకలితో అలమటిస్తారని వివరించారు. ఇప్పటికే అంబానీ, అదానీ గోదాములను నిర్మించారని అన్నారు. రాజ్యాంగం, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను హరిస్తూ మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం తెచ్చిందన్నారు. పార్లమెంటులో చర్చ లేకుండా కార్పొరేట్ సంస్థలకు లాభాలు కట్టబెట్టేందుకు బలవంతంగా వాటిని ఆమోదించిందని చెప్పారు. ఆహార ధాన్యాలకు కనీస మద్దతు ధర లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకు రుణాలు అందక వారు ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని అన్నారు. గిట్టుబాటు ధర రాక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనీ, పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం పెట్టుబడికి అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించి ప్రకటించాలని సూచించారు. ఉదాహరణకు వంద రూపాయలు పెట్టుబడికి ఖర్చయితే 150 రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని వివరించారు. ఇందుకు విరుద్ధంగా రైతులు అడగని మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిందన్నారు. ఈ చట్టాలతో దేశానికే కాకుండా ఆర్థిక వ్యవస్థకు తీవ్రనష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే కేంద్రం దిగొచ్చి ఈ వ్యవసాయ చట్టాలను, లేబర్ కోడ్లను రద్దు చేయాలనీ, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. 27న భారత్బంద్కు కార్మికులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువకులు, విద్యార్థులు, మేధావులు, రాజకీయ నాయకులు ఇలా అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నదని చెప్పారు. బెఫీ ప్రధాన కార్యదర్శి దేబశిష్ బసు, అధ్యక్షత వహించిన అధ్యక్షులు సిజె నందకుమార్ మాట్లాడుతూ రైతుఉద్యమం స్ఫూర్తిదాయకమని అన్నారు. బ్యాంకింగ్రంగంలో అమలవుతున్న ప్రయివేటీకరణ విధానాలను తిప్పికొట్టడానికి దోహదపడుతుందని చెప్పారు. ఈనెల 27న భారత్బంద్లో బ్యాంకు ఉద్యోగులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.