Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ఫలితమే..
- భద్రత కోసం బడ్జెట్లో నిధులు పెంచాలి
- 25 నుంచి సూర్యాపేటలో రాష్ట్ర మహాసభలు: ఐద్వా ఖమ్మం జిల్లా 11వ మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, జాతీయ ఉపాధ్యక్షులు టి.జ్యోతి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా మహిళలపై హింస మరింతగా పెరుగుతోందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ ఉపాధ్యక్షులు టి.జ్యోతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. మహిళల భద్రత కోసం బడ్జెట్లో నిధులు పెంచాలనీ, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదించాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చి మహిళలను మరింత బానిసలను చేస్తోందని విమర్శించారు. మంగళవారం ఐద్వా ఖమ్మం జిల్లా 11వ మహాసభను స్థానిక మంచికంటి భవన్లోని అమరజీవి మైథిలీ శివరామన్ నగర్లో జిల్లా అధ్యక్షురాలు బండి పద్మ అధ్యక్షతన నిర్వహించారు.
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టి.జ్యోతి, మల్లు లక్ష్మి మాట్లాడారు. మద్యం కారణంగానే మహిళలపై హింస పెరిగిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మద్యం ఏరులై పారిస్తోందని ఆరోపించారు. కొత్త పెన్షన్లు రెండేండ్లుగా పెండింగ్లో ఉంచారని తెలిపారు. మహిళా హక్కుల పరిరక్షణకు సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ను 14శాతం నుంచి 33 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో మహిళా బిల్లును ఆమోదించిన యూపీఏ-2 ప్రభుత్వం, లోక్సభలో ఆమోదించకపోవడంతో ఇప్పటికీ పెండింగ్లోనే ఉందన్నారు. చట్టసభల్లో వామపక్షాలు తప్ప మరే పార్టీ కూడా మహిళా సమస్యలపై నిక్కచ్చిగా మాట్లాడటం లేదన్నారు. తెలంగాణ సాయుధ పోరాట గడ్డ సూర్యాపేటలో ఈనెల 25, 26, 27 తేదీల్లో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వెయ్యి మంది ప్రతినిధులతో నిర్వహించే ఈ మహాసభలకు ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, అధ్యక్షురాలు మాలిని భట్టాచార్య హాజరవుతున్నట్టు వివరించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం జెండావిష్కరిస్తారని తెలిపారు.
కాగా, ఖమ్మం జిల్లా మహాసభ సందర్భంగా ఐద్వాలో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ నాయకులను సన్మానించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాతృమూర్తి కమలమ్మను ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బత్తుల హైమావతి సన్మానించారు. విద్యుత్ పోరాట యోధుడు సత్తెనపల్లి రామకృష్ణ తల్లి యశోదమ్మను సీనియర్ నాయకురాలు జ్యోతి సత్కరించారు. సమావేశంలో ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు బుగ్గవీటి సరళ, జిల్లా ప్రధాన కార్యదర్శి మాచర్ల భారతి, జిల్లా నాయకులు అఫ్రోజ్ సమీనా, తదితరులున్నారు.