Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్న మతోన్మాద ఆర్ఎస్ఎస్, బీజేపీ
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-జనగామ
తెలంగాణ ప్రాంతంలో నైజాం రాజరిక పాలన, దొరలు,భూస్వాములు,జమీందార్లు,జాగీర్దార్లు,పటేల్, పట్వా రి అకృత్యాలకు వ్యతిరేకంగా మట్టి మనుషులు సాగించిన మహత్తర వీర తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులు అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం జనగామ జిల్లా పసరమడ్ల గ్రామంలో గ్రామ శాఖ కార్యదర్శి బెజ్జరబోయిన మల్లేశం అధ్యక్షతన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా సాయుధ పోరాటంలో అమరులైన పసరమడ్ల అమరవీ రులకు తమ్మినేని నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పసరమడ్ల గ్రామంలో నాడు పోరాట కాలంలో కమ్యూనిస్టు నాయకుల ఆచూకీ చెప్పాలంటూ ఐదుగురిని చెట్టుకు కట్టేసి కాల్చివేసిన సంఘటనను గుర్తుచేశారు. జనగామ జిల్లాలో ప్రారంభమైన రైతాంగ సాయుధ పోరాటం తెలంగాణ ప్రాంతమంతా జరిగిందనీ, తద్వారా నిజాం రాచరిక పాలన అంతమైందన్నారు. ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గొప్ప పోరాటమని తెలిపారు. కానీ, ఏమాత్రం సంబంధం లేని ఆర్ఎస్ఎస్, బీజేపీ పోరాటచరిత్రను వక్రీకరిస్తే కమ్యూనిస్టులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానం నైజాం నవాబ్ నిరంకుశ పాలనలో నలిగిపోయిందని గుర్తుచేశారు. అప్పటికి తెలంగాణలో అనేక గ్రామాలు వెట్టిచాకిరికి, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా దున్నేవాడికే భూమి కావాలని అనేక గ్రామాల్లో కమ్యూనిస్టుల నాయకత్వంలో మహత్తర పోరాటం జరిగిందని గుర్తుచేశారు. ఖాసీం రజ్వీ రజాకార్లను పోలీస్ మిలటరీ సైన్యాలను జనగామ ప్రాంతంలో కొత్త ముకుంద రెడ్డి, ఏసీరెడ్డి నరసింహారెడ్డి, నల్ల నరసింహులు కాచాం కృష్ణమూర్తి, వడ్ల కొండ నరహరి, ఇమ్మడి రాజిరెడ్డి, జగ్గం హనుమంతు లాంటి అనేకమంది కమ్యూనిస్టులు పోరాడి దొరలు, భూస్వాముల చేతుల్లో ఉన్న 10 లక్షల ఎకరాల భూములను పేద ప్రజలకు పంచారని గుర్తుచేశారు. ఇంతటి పోరాట ధాటికి తట్టుకోలేక నైజాం నవాబు భారత సైన్యాలకు లొంగిపోయి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసినట్టు తెలిపారు. ఇంతటి ఘనచరిత్ర కల్గిన పోరాట చరిత్రను భావితరాలకు అందించి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అధికారికంగా అమరవీరుల సంస్మరణ సభలు జరపాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలను ఆదుకోవడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. రైతుల భూములను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే విధానాలు తీసుకొచ్చారన్నారు. దీనికి వ్యతిరేకంగా సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు మరింత ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు అమరవీరుల స్థూపాల వద్ద జెండా ఆవిష్కరణ చేసి గ్రామంలో బైక్ ర్యాలీ ప్రారంభించారు. సభలో అమరవీరుల కుటుంబ సభ్యులను సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొట్ల శ్రీనివాస్, ఇర్ర అహల్య, రాపర్తి రాజు, బూడిద గోపి, మండల కార్యదర్శి పోత్కనురి ఉపేందర్, జిల్లా కమిటీ సభ్యులు సాంబరాజు, యాదగిరి, శేఖర్, సింగరపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.