Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరల పెంపు పాపం కేంద్రానిదే..
- నిధులన్నీ కేంద్రమే ఇస్తే.. కర్నాటకలో ఎందుకు లేవు? : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
తెలంగాణ నుంచి తీసుకుంటున్న పన్నుల డబ్బులను ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారని.. రాష్ట్రానికి మాత్రం తక్కువ ఇస్తూ ప్రధాని మోడీ దగా చేస్తున్నారనిమున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. నిత్యావసర సరుకులతో పాటు డీజిల్, పెట్రోల్ ధరల పెంపు పాపం కేంద్రానిదేనని చెప్పారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో మంగళవారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ప్రగతి ఆశీర్వాద సభలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రం ఏటా రూ.2.72లక్షల కోట్లను పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తుంటే.. రాష్ట్రానికి ఇచ్చేది కేవలం రూ.లక్షా 40కోట్లు మాత్రమేనన్నారు. ఇది నిజం కాకపోతే నేను రాజీనామా చేస్తాను.. లేదంటే బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నింటికీ మొత్తం నిధులను కేంద్రమే ఇస్తే.. కర్ణాటక రాష్ట్రంలో ఎందుకు లేవని ప్రశ్నించారు. గద్వాల జిల్లాలో రూ.104 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. జూరాల రిజర్వాయర్ దగ్గర పర్యాటక కేంద్రం, గద్వాల పట్టణంలో బాలికల, బాలుర హాస్టల్, రూ.60కోట్లతో మున్సిపల్ కేంద్రంలో సీసీ రోడ్లు, ఫ్లై ఓవర్ తదితర అనేక అభివద్ధి కార్యక్రమాలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నామన్నారు. మతమౌఢ్యంలో చిక్కుకున్న ఆ పార్టీ నాయకులు అనేక విధాలుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ప్రాంతం నుంచి బీజేపీ జాతీయ నాయకురాలిగా ఉన్న డీకే అరుణ కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఈ ప్రాంత ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కళాశాల నిర్మిస్తామని హామీనిచ్చారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యో గాలను భర్తీ చేస్తామన్న ప్రధాని మోడీ.. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి మాటలు కొత్త బిచ్చగాడిని తలపిస్తోందన్నారు. తెలంగాణ ప్రజ లను ప్రేమించండి తప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ను దూషించడం తగద న్నారు. ఈ ప్రాంతంలో అధికంగా ఉన్న బోయలను ఎస్టీలో చేర్పించడానికి చెన్నప్ప కమిషన్ వేశామని, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కేంద్రంతో మాట్లాడి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సభలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం, జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్కు నిరసన సెగ
మంత్రి కేటీఆర్కు నిరసన సెగ తగిలింది. గోస్పాడు రైతులు కాన్వారుని అడ్డుకున్నారు. ప్యాకేజీ 98 కాల్వ పనులు పూర్తి కాకుండా శంకుస్థాపనలు ఎలా చేస్తారని నిలదీశారు. అలంపూర్ చౌరస్తాలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముందే గమనించిన పోలీసులు సీపీఐ, టీడీపీ, బీజేపీ నాయకులతో పాటు రైతు సంఘం నాయకులను అరెస్టు చేశారు. అలంపూర్లోనే వంద పడకల ఆస్పత్రిని నిర్మించాలని కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు.