Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన డీసెట్ రాతపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు డీసెట్ కన్వీనర్ శ్రీనివాసాచారి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు మీడియంకు 3,007 మంది దరఖాస్తు చేయగా, 2,255 మంది పరీక్ష రాస్తే, 1,617 (71.70 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని వివరించారు. 68 మార్కులతో గడీల అనోద ప్రథమ ర్యాంకు పొందారని పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియంకు 3,568 మంది దరఖాస్తు చేస్తే 2,685 మంది పరీక్ష రాశారనీ, 1,996 (74.33 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. 72 మార్కులతో వడ్లగేరి సుదీంద్రరెడ్డి అగ్రస్థానంలో నిలిచారని వివరించారు. ఉర్దూ మీడియంకు 1,016 మంది దరఖాస్తు చేయగా, 878 మంది పరీక్షకు హాజరయ్యారనీ, వారిలో 298 (33.94 శాతం) మంది ఉత్తీర్ణత పొందారని పేర్కొన్నారు. 52 మార్కులతో తస్మియా ఖుద్సియా మొదటి ర్యాంకు పొందారని వివరించారు. ఉత్తీర్ణత పొందిన విద్యార్థుల మార్కులు, ర్యాంకు కార్డుల వివరాలు http://deecet.cdse.telangana.gov.in వెబ్సైట్లో గురువారం నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు. డీసెట్ కౌన్సెలింగ్, ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ఆప్షన్ల నమోదు వంటి వివరాలను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు.