Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో తాజాగా 324 మందిలో కరోనా ఉన్నట్టు బయటపడింది. ఒకరు మరణించారు. బుధవారం విడుదల చేసిన బులెటిన్లో పాజిటివ్ రేటు 0.44 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం 5.30 గంటల నుంచి బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు 73,323 మందికి టెస్టులు చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో 67,246 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 6,077 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 2,062 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,325 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా కోలుకున్న 280 మందిని డిశ్చార్జి చేశారు. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 79 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో ఇద్దరు ఈ వ్యాధి బారిన పడ్డారు. జోగులాంబ గద్వాల, కొమురంభీం ఆసిఫాబాద్, ములుగు, నారాయణపేట జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.
ప్రభుత్వాస్పత్రుల్లో తగ్గిన కరోనా రోగులు
కరోనా పాజిటివ్ వచ్చినా లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు కలిగిన వారు ఆస్పత్రుల్లో చికిత్స కోసం రావటం రోజు రోజూకు తగ్గిపోతున్నది. వీరి కోసం రాష్ట్రంలోని 92 ఆస్పత్రుల్లో 5,526 జనరల్ వార్డు పడకలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. బుధవారం నాటికి కేవలం 24 ఆస్పత్రుల్లోనే 175 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలోనూకొత్తగూడెంలోని సింగరేణి కంపెనీస్ కాలరీస్ లిమిటెడ్ మెయిన్ ఆస్పత్రిలో అత్యధికంగా 42 మంది ఉండగా, భూపాలపల్లి ఏరియా ఆస్పత్రిలో 38 మంది ఉన్నారు. మరో 11 మంది రామగుండంలో ఉన్నారు. హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో కేవలం 10 మంది ఉండగా, టిమ్స్, నిమ్స్లలో 12 మంది చొప్పున, కేంద్ర ప్రభుత్వ ఈఎస్ఐ ఆస్పత్రిలో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ఇక పడకలపై చికిత్స పొందుతున్న 356 మందిలో అత్యధికంగా వరంగల్ అర్బన్ జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రిలో 48 మంది ఉండగా, నల్లగొండ జనరల్ ఆస్పత్రిలో 41 మంది, కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో 32 మంది ఉన్నారు. ఐసీయూ బెడ్లలో 373 మంది ఉంటే అందులో 180 మంది హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో, 30 మంది ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో ఉన్నారు.