Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు రద్దును డిమాండ్ చేస్తూ ఈనెల 27న జరిగే భారత్బంద్ను విజయ వంతం చేయాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (తెలం గాణ) ప్రజలకు పిలుపునిచ్చింది. మగ్దూంభవన్లో బుధవారం కమిటీ జాతీయ వర్కింగ్ గ్రూప్ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య, రాష్ట్ర కన్వీనర్లు టీ సాగర్, పశ్యపద్మ, రణధీర్, ఉపేందర్రెడ్డి, తుకారాంనాయక్, సాయన్న, ఆర్ వెంకట్రాములు, కె కాంతయ్య ఆధ్వర్యంలో భారత్బంద్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. పోస్టర్లో భారత్బంద్ విజయాన్ని జయప్రదం చేయాలని కోరుతూ, తొమ్మిది ప్రధాన డిమాండ్లను ముద్రించారు. వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు అన్ని పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలనీ, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలనీ, కార్మిక వేజ్ కోడ్ చట్టాలను రద్దు చేయాలనీ, ఆదివాసీలు, పేదలు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలనీ, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ ఆపాలనీ, ప్రభత్వ విద్యరంగాన్ని కాపాడుతూ, కార్పొరేట్ ప్రయివేటు విద్యాసంస్థల్ని నియంత్రించాలనీ, నిత్యవసర వస్తువుల ధరలు, వంటగ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలనీ, వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. పది నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమిస్తున్నా, కేంద్రం ఏమాత్రం స్పందించకపోవడాన్ని వారు తప్పుపట్టారు. నిరంతర పోరాటంలో ఇప్పటి వరకు 650 మంది రైతులు చనిపోయారనీ, పోలీసుల లాఠీచార్జిల్లో అనేకమంది క్షతగాత్రులయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు రక్షణ, వ్యవసాయ పరిరక్షణ, దేశ ప్రజల ఆహార భద్రత కోసం రైతాంగ పోరాటాన్ని శాంతియుతంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 27న జరిగే భారత్ బంద్లో ప్రజలంతా భాగస్వాములై అన్నంపెట్టే రైతుకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.