Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐసీటీఈ చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్ బుద్ధ
- స్టాన్లీ ఇంజినీరింగ్ కాలేజీలో అంతర్జాతీయ సదస్సు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సాంకేతిక పరిజ్ఞానంతోనే నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు చేయడం సాధ్యమవుతుందని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్ బుద్ధ అన్నారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న అధునాతన మార్పులను నిరంతరం గమనించాలనీ, అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. 'అప్లయిడ్ మ్యాథమెటిక్స్, మోడలింగ్ అండ్ సిములేషన్ ఇన్ ఇంజినీరింగ్ (ఏఎంఎస్ఈ 2021)' అనే అంశంపై స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో రెండురోజులపాటు జరిగే అంతర్జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. వర్చువల్లో ఆయన మాట్లాడుతూ నూతన విద్యావిధానంలో సంప్రదాయ కోర్సులతోపాటు సాంకేతిక విద్యలోనూ పలు సంస్కరణలు తెస్తున్నామని వివరించారు. అందులో భాగంగానే 11 ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్ విద్యను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఇందుకనుగుణంగా ప్రాంతీయ భాషల్లో సిలబస్ను అనువాదం చేయడం పూర్తయిందన్నారు. లోతుగా, సులభంగా అర్థం చేసుకుని పరిశోధనలు, నవకల్పనలు పెరిగేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. ప్రాంతీయ భాషల్లో చదువుకోవడమంటే ఇంగ్లీష్ నేర్చుకోవద్దని చెప్పడం కాదన్నారు. మాతృభాషపై పట్టు పెరిగితే అన్ని భాషలనూ నేర్చుకునేందుకు అవకాశముంటుందని సూచించారు. ఓయూ రిజిస్ట్రార్ పి లక్ష్మినారాయణ మాట్లాడుతూ స్టాన్లీ కాలేజీ విద్యార్థులు ఏడాదికి రూ.6.5 లక్షల సగటు వేతనంతో విద్యార్థులు ప్లేస్మెంట్లు పొందుతున్నారని వివరించారు. స్టాన్లీ కాలేజీ అధ్యాపకులు సల్మాన్ అబ్దుల్ మోయిజ్, వైవిఎస్ఎస్ ప్రగతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీన్ ఎ వినయబాబు, కార్యదర్శి కె కృష్ణారావు, ప్రిన్సిపాల్ కె సత్యప్రసాద్ లంక తదితరులు పాల్గొన్నారు.