Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీఈయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
- ఆర్జీ-1లో కార్మికుల పోరుయాత్ర
నవతెలంగాణ - గోదావరిఖని
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే ఇవ్వాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి, జెబిసీసీఐ సభ్యుడు మందా నరసింహారావు, సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, పర్మినెంట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎస్సీఈయూ ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి కార్మిక పోరు యాత్ర బుధవారం గోదావరిఖని ఆర్జీ-1లోకి ప్రవేశించింది. బొగ్గు బావులు, కాంట్రాక్టు కార్మిక అడ్డాలపై గేటు మీటింగు నిర్వహించారు. అనంతరం గోదావరిఖనిలోని శ్రామిక భవన్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పోరుయాత్ర సభ్యులు మాట్లాడారు. సింగరేణిలో వెలికితీసిన బొగ్గుతో కరెంటును తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అతి తక్కువ ధరకు అమ్ముతున్నారన్నారు. దీని ద్వారా సింగరేణికి ప్రభుత్వం 12వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా, ఇంతవరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సింగరేణి సంస్థ 300 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో చెల్లించాల్సి వచ్చిందని, దీనంతటికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచిత విధానమే కారణమని విమర్శించారు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మందబలంతో కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. పనిగంటలు కోల్పోతామని, జీతం అడిగే హక్కు, సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు కోల్పోతామని, ఇవన్నీ జరిగాక ప్రయివేటు పెట్టుబడిదారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాపాడుకోవడానికి మరో పోరాటానికి కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో 73 షెడ్యూలు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతన పెంపు జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులు ఉంటున్న క్వాటర్లను వారికే కేటాయించాలని, లేకపోతే 250 గజాల స్థలాన్ని ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులకు కూడా క్వాటర్స్ కేటాయించాలని కోరారు. ఈ యాత్రలో సీఐటీయూ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వేల్పుల కుమారస్వామి, ఎర్రవెల్లి ముత్యంరావు, ఎస్సీఈయూ ఆర్జీ-1 అధ్యక్ష కార్యదర్శులు మేదరి సారయ్య, మెండే శ్రీనివాస్, నాయకులు కారం సత్తయ్య, దాసరి మహేష్, సిహెచ్ వేణుగోపాల రెడ్డి, ఆరెపల్లి రాజమౌళి, ఏ.వెంకటేష్ బాబు, ఎస్ రవి, అన్నం శ్రీనివాస్, మునుకుంట్ల రామన్న, ఇప్పలపల్లి సతీష్ కుమార్, రమేష్, నంది నారాయణ, రవి తదితరులు పాల్గొన్నారు.