Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరెస్టు చేసిన అటవీశాఖ అధికారులు
- ఆ పాము దగ్గరుంటే అదృష్టమనేది మూఢనమ్మకం : పీసీసీఎఫ్ శోభ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్లో రెండు తలలుండేలా కనిపించే పామును అమ్మేందుకు యత్నించిన నలుగురు సభ్యుల ముఠాను అటవీశాఖ విజిలెన్స్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. కారు, టూ వీలర్ వాహనం, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని మేడ్చల్ కోర్టులో హాజరుపరిచారు. విజిలెన్స్ డీఎఫ్ఓ సుధాకర్ రెడ్డి, ఉన్నతాధికారుల వివరాల ప్రకారం..సగ్గుర్తి రోహిత్, జాలిగ శ్రీధర్, రాయుడు వెంకటరమణ, వీ. ఆంజనేయ ప్రసాద్ అనే నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడ్డారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ అటవీ ప్రాంతంలో రెండు తలలు ఉండేలా కనిపించిన ఓ పామును పట్టుకున్నారు. కొంతకాలంగా దాన్ని పలువురికి అమ్మే ప్రయత్నం చేశారు. ఆ పామును ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసివస్తుందనీ, గుప్త నిధులు దొరుకుతాయని ప్రచారంలో పెట్టారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న అటవీ శాఖ విజిలెన్స్ విభాగం అధికారులు రంగంలోకి దిగి పాము కొనుగోలుదారులుగా ఆపరేషన్ మొదలు పెట్టారు. సుమారు నాలుగున్నర కేజీల బరువుతో బలంగా ఉన్న పామును రూ.70 లక్షలకు అమ్ముతామంటూ నలుగురు సభ్యుల ముఠా వారి ముందు బేరంపెట్టింది. ఆపరేషన్ చేస్తున్న అధికారులను అనేక సార్లు ఏమార్చేందుకు ప్రయత్నం చేశారు. చివరకు ఈసీఐఎల్ సమీపం నాగారంలో ఓ ఇంట్లో దొరికిపోయారు. ఈ ఆపరేషన్లో విజిలెన్స్, యాంటీ పోచింగ్, కీసర రేంజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆపరేషన్లో పాల్గొన్న డీఎఫ్ఓతో పాటు, విజిలెన్స్ సిబ్బందిని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) ఆర్. శోభ అభినందించారు. రెండు తలల పాము అపోహ మాత్రమేననీ, రెడ్ సాండ్ బోవా అని పిలిచే ఆ పాముకు రెండు తలలుండవని చెప్పారు. ఆ పాము ద్వారా అదృష్టం, గుప్త నిధులు కలిసిరావటం అనేది పూర్తిగా మూఢనమ్మకమనీ, అలాంటి ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. ఆ పామును అమ్మినా, కొన్నా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారి సమాచారం తెలిస్తే అటవీ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 18004255364 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.