Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుదుత్పత్తే అంతిమ లక్ష్యం
- అయస్కాంత శక్తితో పవర్ జనరేషన్
- 1.47 లక్షల కోట్లతో భారీ ప్రాజెక్టు
- భారత్, చైనా సహా 35 దేశాల సన్నాహం
- ఇప్పటికే 75 శాతం వరకు పూర్తయిన పనులు
పారిశ్రామిక విప్లవం, సాంకేతికత అభివృద్ధి, జీవనశైలిలో మార్పులు వెరసి భవిష్యత్ లో విధ్యుత్ డిమాండ్ భారీగా పెరగనున్నది. అయితే, రానున్న కాలంలో అవసరమయ్యే బ్రహ్మాండమైన విద్యుత్ డిమాండ్ను చేరుకోవడానికి శాస్త్రవేత్తలు గత కొన్నేండ్లుగా పరిశోధనలను ముమ్మరం చేస్తూనే ఉన్నారు. శిలాజ ఇంధనం, న్యూక్లియర్ రియాక్టర్ల ద్వారా విద్యుదుత్పత్తి సాధ్యమవుతున్నప్పటికీ పర్యావరణం పరంగా విపరీతమైన దుష్పరిణామాలు తలెత్తుతున్నాయి. సౌర, పవన, జల వనరుల సాయంతో విద్యుదుత్పత్తి
జరుగుతున్నా.. భవిష్యత్ డిమాండ్ ను అవి ఎంత మేరకు పూడ్చగలదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ క్రమంలోనే సూర్య గోళానికి సమానమైన శక్తితో 'సూపర్ పవర్ జనరేషన్'కు మూడు ఖండాలకు చెందిన దేశాలు సమాయత్తమయ్యాయి. అదే 'ఐటీఈఆర్' ప్రాజెక్ట్. ఆ నేపథ్యంపై 'నవతెలంగాణ' ప్రత్యేక కథనం..
ఏమిటీ 'ఐటీఈఆర్' ప్రాజెక్ట్?
భవిష్యత్ విద్యుత్ అవసరాలను తీర్చడానికి 'నేలపైన సూర్యుడి'ని నిర్మించేందుకు మూడు ఖండాలకు చెందిన దాదాపు 35 దేశాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఆ ప్రాజెక్టే 'ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్ పరమెంటల్ రియాక్టర్ (ఐటీఈఆర్)'. భారత్ తో పాటు అమెరికా, రష్యా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఐరోపా దేశాలు ఈ ప్రాజెక్టులో భాగమై ఉన్నాయి.
విమానాన్ని సైతం ఎత్తేయగలదు
దక్షిణ ఫ్రాన్స్ లో నిర్మించిన ఐటీఈఆర్ లో పెద్ద అయస్కాంతం ఉంటుంది. 60 అడుగుల ఎత్తు, 14 అడుగుల వ్యాసంతో ఏకంగా ఒక విమానాన్ని సైతం అతి సులభంగా ఆకర్షించగల ఈ అయస్కాంతం.. శక్తి ఉత్పన్నంలో కీలక పాత్ర పోషించనున్నది. విశ్వంలోని నక్షత్రాల్లో జరిగే 'ఫ్యూజన్ మిమిక్' ప్రక్రియను ఆధారంగా చేసుకొని రియాక్టర్ లో రెండు హైడ్రోజన్ అణువులను దగ్గరగా చేర్చి బ్రహ్మాండమైన శక్తిని ఉత్పత్తి చేయనున్నారు. సూర్యుడి ఉపరితలంలో ఉండే బ్రహ్మాండమైన ఉష్ణోగ్రతలు ఫ్యూజన్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు కొంత మొత్తంలో వెలువడొచ్చని అంచనా వేస్తున్నారు. విద్యుదుత్పత్తిలో భాగంగా సాధారణ న్యూక్లియర్ రియాక్టర్ లో జరిగే ఫ్యూజన్ ప్రక్రియలో హానికరమైన రేడియోయాక్టివ్ ఉద్గారాలు వెలువడుతాయి. అయితే, ఐటీఈఆర్ లో ఈ సమస్య ఉండబోదని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే భవిష్యత్ విద్యుత్ అవసరాలకు ఐటీఈఆర్ ఒక చక్కని పరిష్కారాన్ని చూపగలదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పుడు అందుబాటులోకి?
ఇప్పటికే 75 శాతం వరకు పూర్తయిన ఈ రియాక్టర్ ను 2026లో మండించ నున్నారు. 2030 నాటికి విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టుకు రూ.1.47 లక్షల కోట్లను ఖర్చు చేస్తున్నారు.
- జై