Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరితగతిన పూర్తిచేయాలి
- చైర్మెన్ అల్లం నారాయణ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మీడియా అకాడమి భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మెన్ అల్లం నారాయణ రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్లను కోరారు. బుధవారంనాడు నాంపల్లిలో మీడియా అకాడమి భవన నిర్మాణ పనులను చైర్మెన్ అల్లం నారాయణ పరిశీలించారు. అనంతరం సంబంధిత కాంట్రాక్టర్, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ మీడియా అకాడమి నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి నవంబర్ వరకు జర్నలిస్టులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. జర్నలిస్టులకు ఉపయోగపడేలా మీడియా అకాడమి భవనాన్ని బహుళ అంతస్తులతో నిర్మిస్తున్నామనీ, ఇందులో 200 మందికి సరిపడేలా ఆడిటోరియం ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ఈ భవనంలో జర్నలిస్టులకు శిక్షణా తరగతులు, సర్టిఫికేట్ కోర్సుల నిర్వహణ, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, వీడియా కాన్ఫరెన్స్తోపాటు ఆధునిక సౌకర్యాలతో కూడిన ఆడిటోరియంను అందుబాటులోకి తేనున్నామని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. క్రమం తప్పకుండా పనులను పర్యవేక్షించాలని మీడియా అకాడమి కార్యదర్శికి సూచించారు.ఈ సమావేశంలో మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, కాంట్రాక్టర్ నర్రా శ్రీనివాస్, రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నర్సింగరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మాధవి, అసిస్టెంట్ ఇంజినీర్ నితిన్, మీడియా అకాడమి అకౌంట్స్ ఆఫీసర్ పూర్ణచందర్ రావు, మేనేజర్ వనజ, తదితరులు పాల్గొన్నారు.