Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలి
- రాజకీయ లబ్ది కోసమే సుప్రీంను ఆశ్రయించిన ప్రభుత్వం
- హుస్సేన్సాగర్ను పరిరక్షించాలి:
జేవీవీ నేతలు వరప్రసాద్, కోయ వెంకటేశ్వరరావు, న్యాయవాది వేణుమాధవ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హుస్సేన్సాగర్లో నీళ్లు పూర్తిగా కలుషితమయ్యాయనీ, అందులో వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేయడం అవమానకరమని జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల వరప్రసాద్, ఉపాధ్యక్షులు కోయ వెంకటేశ్వరరావు, ప్రముఖ న్యాయవాది మామిడి వేణుమాధవ్ అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన విగ్రహాలను అక్కడ నిమజ్జనం చేయొద్దని డిమాండ్ చేశారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. కానీ రాజకీయ లబ్ది కోసమే హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేసేందుకు అవకాశం కల్పించాలంటూ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిందని విమర్శించారు. బుధవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ మట్టి వినాయకుడే గట్టి వినాయకుడు అని చెప్పారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేయకూడదంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. కృత్రిమ నీటిగుంటలను ఏర్పాటుచేసి నిమజ్జనం చేయాలని సూచించారు. పరిశ్రమల వ్యర్థం, వినాయక నిమజ్జనంతో హుస్సేన్సాగర్ ఇప్పటికే కలుషితమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేవీవీ ఆరోగ్య సబ్ కమిటీ కన్వీనర్ సురేష్కుమార్, నాయకులు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.