Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేనేత రంగాన్ని విస్మరించిన పాలకులు
- కార్మికుల హక్కుల పునరుద్ధరణ కోసమే పాదయాత్ర : కార్మికగర్జన పాదయాత్ర బృంద సభ్యులు
- బీబీనగర్లో సాగుతున్న యాత్ర
నవతెలంగాణ-బీబీనగర్/భూదాన్పోచంపల్లి
''చేనేత రంగాన్ని పాలకులు విస్మరిం చారు.. ఆ కుటుంబాలు ఆర్థికంగా అనేక ఇబ్బం దులు పడుతున్నాయి.. చిన్న పరిశ్రమలను వదిలేసి.. పెద్ద పరిశ్రమలకే రాయితీలు ఇస్తున్నారు.. కార్మికుల వేతన సవరణ జరక్క కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు.. అందుకే కార్మికుల హక్కుల పునరుద్ధరణ కోసం ఈ పాదయాత్ర చేస్తున్నాం.. '' అని కార్మిక గర్జన పాదయాత్ర బృంద సభ్యులు అన్నారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి, బీబీనగర్ మండలాల్లో సాగింది. భూదాన్పోచంపల్లిలోని చేనేత కార్మికుల ఇండ్లల్లో మగ్గాలను పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం బీబీనగర్ మండలం మగ్ధుంపల్లిలో విలేకర్ల సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 13,633 చేనేత, పవర్లూమ్ కార్మికుల కుటుంబాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగాన్ని కేవలం కులవృత్తిగా చూడటం వల్ల.. ఉపాధి లేక కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చిన్న పరిశ్రమలను పట్టించుకోకుండా పెద్ద పరిశ్రమలకే రాయితీలు కల్పిస్తోందన్నారు. వేతన సవరణ చేయకపోవడంతో కార్మికులు రూ.14,763 కోట్లు కోల్పోయారని, ఆ డబ్బులన్నీ యాజమాన్యాల జేబుల్లోకి వెళ్లాయని చెప్పారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కార్మికులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీబీనగర్, భువనగిరి మండలాల్లోని పరిశ్రమల్లో ఎక్కువగా వలస కార్మికులే ఉన్నారన్నారు. వారికి కనీస వసతులు కల్పించకుండా దినసరి కూలీలుగా మార్చి 12 నుంచి 18 గంటల పాటు పనులు చేయించుకుంటున్నారని తెలిపారు. పరిశ్రమల వద్దే కార్మికుల కోసం నిర్మించిన వసతి గదులు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. ఒక్కో గదిలో ఎనిమిది మంది చొప్పున ఉంటున్నట్టు తమ బృందం పరిశీలనలో తేలిందన్నారు. స్థలం సరిపోక ఆరుబయట నిద్రించాల్సి వస్తుందని కార్మికులు తమ దృష్టికి తీసుకొచ్చినట్టు చెప్పారు. శేషసాయి స్పాంజ్ ఐరన్ పరిశ్రమను కరోనా సాకుతో మూసేసి కార్మికులకు సెటిల్మెంట్ ద్వారా డబ్బులు అందజేస్తామని ప్రకటించి.. గ్రాడ్యుటీ అందజేసి చేతులు దులుపుకుందన్నారు. 150 ఏండ్ల కిందట కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని, కనీస వేతన సవరణ చేయకుండా కాలయాపన చేస్తుందని అన్నారు.పాదయాత్ర ముగింపులోపు ప్రభుత్వం కనీస వేతనాలు సవరించాలని, లేని పక్షంలో పాదయాత్ర తర్వాత కోటీ 20 లక్షల మంది కార్మికులతో కలిసి చేసే సమ్మెను యాజమాన్యాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అంతకు ముందు పాద యాత్ర బృందానికి సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భూపాల్, జయలక్ష్మీ, పాలడుగు భాస్కర్, బీబీనగర్ మండల కన్వీనర్ బండారు శ్రీరాములు, నాయకులు గాడి శ్రీనివాస్, టంటం వెంకటేశ్, గడ్డం ఈశ్వర్, సత్యనారాయణ, ఓవల్దాసు కొండల్, సిలివేరు రమేశ్, పొట్ట యాదమ్మ పాల్గొన్నారు.