Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్న ఎమ్డీ సజ్జనార్
- సమస్యల అధ్యయనంపై స్వయంగా రంగంలోకి
- సాధారణ ప్రయాణికుడిలా ఆర్టీసీ బస్సులో ప్రయాణం
- ఎమ్జీబీఎస్లో మరుగుదొడ్లు సహా సౌకర్యాల పరిశీలన
- సెలవు రోజుల్లో ఇంటి వద్ద సమీక్షలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
విశ్వనాధ్ చెన్నప్ప సజ్జనార్ (వీసీ సజ్జనార్) ఐపీఎస్ అధికారిగా ఆయన ఎక్కడ సేవలు అందించినా, అవి భిన్నంగా ఉంటాయి. ఆయన తీసుకొనే నిర్ణయాలు ఆలోచన రేకెత్తించేలా ఉంటాయి. నిన్న మొన్నటి వరకు కేసులు, నేరస్తులు, సమీక్షల పేరుతో పరుగులు తీసిన ఆయన ఇప్పుడు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్గా కొత్త బాధ్యతల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడా ఆయన తనదైన స్టైల్నే కొనసాగిస్తున్నారు. ఆఫీసులకే పరిమితమయ్యే అధికారుల్ని క్షేత్రస్థాయికి పిలిపిస్తున్నారు. ఎమ్డీగా బాధ్యతలు స్వీకరించగానే చెప్పాపెట్టకుండా ఆకస్మికంగా ఓపీ టైంలో తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో ప్రత్యక్షమయ్యారు. ఆస్పత్రి ప్రాంగణం మొత్తం కలియతిరిగారు. ఏం చేయోచ్చు...ఏం చేయకూడదో అక్కడికక్కడే సమీక్ష నిర్వహించి, ఆదేశాలు జారీ చేశారు. మొన్నటికి మొన్న వరుసగా మూడు రోజులు సెలవులు వస్తే, ఆయనేం ఖాళీగా కూర్చోలేదు. విభాగాల వారీగా అధికారుల్ని తన ఇంటికి పిలిపించుకొని, సుదీర్ఘంగా సమస్యలపై చర్చించారు. అధికారుల పనితీరు, వారికున్న నిబద్ధత, సంస్థను బతికించుకోవాలంటే ఏం చేయాలి.. అనే అనేక అంశాలను ఆయన వ్యక్తిగతంగా ప్రశ్నలు సంధించి, పూర్తి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. స్వతహాగా ఐపీఎస్ అధికారి కాబట్టి..ఈ సమీక్షలు కూడా కేసు ఇన్వెస్టిగేషన్ తరహాలోనే జరుగుతున్నాయని బస్భవన్లో సరదా చర్చలు జరుగుతున్నాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు వారి పర్సనల్ సెక్రటరిలను కూడా ఆ గదిలోకి అనుమతించట్లేదు. సెలవు రోజు బస్భవన్లోని ఓ అధికారిని మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి పిలిచి, రాత్రి 9 గంటల వరకు ఆయనతో అనేక విషయాలపై లోతుగా మాట్లాడారు. అనేక ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకు న్నట్టు సమాచారం. సహజంగా సమీక్షా సమావేశాలు అంటే అధికారులందరినీ ఒకే చోట కూర్చోబెట్టి చర్చలు జరుపుతారు. కానీ సజ్జనార్ మాత్రం ఏ విభాగానికి ఆ విభాగాన్ని విడగొట్టి, సదరు అధికారితో నేరుగా చర్చలు జరుపుతున్నారు. దీనితో అధికారులు మరింత అప్ర మత్తంగా, బాధ్యతగా వ్యవహరిస్తు న్నట్టు తెలుస్తున్నది. సైదాబాద్లో ఆరేండ్ల చిన్నారి హత్య కేసు నిందితుడిని గుర్తించేందుకు ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలంటూ సామాజిక బాధ్యతను ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. తాజాగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకుల సాదకబాదకాలు, డ్రైవర్, కండక్టర్ల పనితీరు తెలుసుకొనేందుకు బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఓ సాధారణ ప్రయాణీకుడి మాదిరి జీడిమెట్ల డిపోకు చెందిన 9 ఎక్స్/272 (గండి మైసమ్మ-అఫ్జల్గంజ్-సీబీఎస్ రూటు) బస్సును లక్డీకాపూల్లో ఎక్కారు. ముఖానికి మాస్కు పెట్టుకొని, కండక్టర్ దగ్గరి నుంచి టిక్కెట్ కొనుగోలు చేశారు. సాధారణ ప్రయాణికుడి మాదిరి ఆమెతో మాటా ముచ్చట కలిపారు. ట్రిప్పుకు ఎంత ఆదాయం వస్తున్నదీ...ఎంత మంది ప్రయాణీకులు ఎక్కుతున్నారు...ఎక్కువ మంది ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే ఏం చేయాలి.. అంటూ కండక్టర్, డ్రైవర్ల నుంచి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అలాగే బస్సులోని ఇతర ప్రయాణికులతోనూ మాటలు కలిపారు. ఎమ్జీబీఎస్లో బస్సు దిగి ఆ పరిసరాలన్నీ కలియ తిరిగారు. మూత్రశాలలు, మరుగుదొడ్లలో పరిశుభ్రతను పరిశీలించారు. ప్లాట్ఫాంపై నిలబడి ఉన్న బస్సు సిబ్బందితో ముచ్చట్లు పెట్టి ఆదాయ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే వేర్వేరు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులతోనూ మాట కలిపి, వారి అభిప్రాయాలూ స్వీకరించారు. పార్కింగ్ స్థలాలనూ, ఖాళీగా ఉన్న బస్టాండ్ స్టాల్స్, సెక్టార్ వైజ్ రూట్ బోర్డులు, ఎంక్వైరీ, రిజర్వేషన్ కేంద్రాలనూ పరిశీలించారు. అందరితో ముచ్చటిస్తున్నా... ఆయన ఆర్టీసీ ఎమ్డీ అని అక్కడి సిబ్బంది కానీ, ప్రయాణీకులు కానీ ఎవ్వరూ గుర్తుపట్టకపోవడం గమనార్హం. ఆ తర్వాత అక్కడి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (హెచ్ అండ్ కె) కార్యాలయానికి వెళ్లారు. అప్పటికప్పుడు అక్కడి సిబ్బందితో ఎమ్డీ హౌదాలో సమావేశమయ్యారు. మరుగు దొడ్లలో పరిశుభ్రతను మెరుగు పరచాలనీ, పార్కింగ్ స్థలంలో చాలా కాలంగా పేరుకుపోయిన వాహనాలను తక్షణం స్క్రాప్యార్డ్కు తరలించాలని ఆదేశించారు. ప్రకటనల ద్వారా అదనపు ఆదాయ సముపార్జనకు అక్కడి పార్కు నిర్వహణను ఔట్సోర్సింగ్ ఏజెంట్లకు అప్పగించాలని చెప్పారు. ఖాళీగా ఉన్నస్టాల్స్ను వెంటనే భర్తీ చేసి, ఆదాయం సమకూర్చాలనీ, టిక్కెటేతర ఆదాయం పెంచుకోవడం కోసం పండుగలు, వివాహ సమయాల్లో బస్సులను అద్దెకు ఇవ్వాలనీ, వచ్చే దసరా రద్దీకి తగిన బస్సులు నడపాలని ఆదేశించారు. దసరాకు ఇప్పటి నుంచే రిజర్వేషన్ సౌకర్యాలనూ కల్పించాలనీ, దానికి అవసరమైన ప్రచారాన్నీ కల్పించాలని ఎమ్జీబీఎస్ అధికారులకు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఓ ఐపీఎస్ అధికారి ఆర్టీసీ ఎమ్డీగా తొలిసారి నియామకం కావడం గమనార్హం. ఆ మార్పును సజ్జనార్ ఏ మేరకు సాధిస్తారో వేచిచూడాలి!!