Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్వీకే వెబినార్లో తమ్మినేని
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సాయుధ పోరాటం నైజాం పాలనలో నెలకొన్న భయంకరమైన వెట్టిచాకిరి భరతం పట్టిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. భూస్వాములు, జామీందార్లు, జాగీర్దార్లు విధించిన భూమిశి స్తుకు వ్యతిరేకంగా గ్రామగ్రామాన పోరాటాలు ఉవ్వెత్తున కొనసాగాయని గుర్తు చేశారు. ఆ పోరాట ఫలితంగా ప్రజాస్వామ్య హక్కులు, సాంస్కృతిక అణిచివేత నుంచి ప్రజలకు విముక్తి, భూమిలేని నిరుపేదలకు వాటిని పంచటం తదితర పరిణామాలు చోటు చేసుకున్నాయని వివరించారు. మూడువేల గ్రామాలు విముక్తి చెందాయనీ, 10 లక్షల ఎకరాల భూమి పేదల చేతుల్లోకి వచ్చిందని తెలిపారు. కుల, మతాలకు అతీతంగా జరిగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ మతపరమైన పోరాటంగా చిత్రికరిస్తున్నదని విమర్శించారు. కట్టుకథలు, అవాస్తవాలను ప్రచారం చేస్తూ చరిత్రకు మతం రంగు పులుముతున్నదని చెప్పారు. ముస్లిం రాజైన నైజాంకు వ్యతిరేకంగా హిందువులు పైచేయి సాధించినట్టుగా సాయుధ పోరాటాన్ని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దాన్ని విమోచన దినోత్సవంగా జరపాలని డిమాండ్లు పెడుతున్నారని తెలిపారు. హిందువు, ముస్లిం మతాల మధ్య వైషమ్యాలు సృష్టించి కాషాయదళం విస్తరిస్తున్నదని చెప్పారు. అందులో భాగంగా దక్షణాదిలో బలపడేందుకు కుట్రలు చేస్తున్నదని చెప్పారు. వాటిని తిప్పికొట్టేందుకు సమయత్తం కావాలని పిలుపునిచ్చారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో 'తెలంగాణ సాయుధ పోరాటం సాధించిన ఫలితాలు' అనే అంశంపై వెబినార్ జరిగింది. ఎస్వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ తన బలాన్ని పెంచుకునేందుకు సాయుధ పోరాటాన్ని హిందువులు నిర్వహించిందని చెబుతున్నదని విమర్శించారు. హిందు, ముస్లిం మతఘర్షణలు సృష్టించి అంచెలంచెలుగా ఎదిగిందని ఉదహరించారు.