Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిమ్స్కు గుండె, కిమ్స్కు ఊపిరితిత్తుల తరలింపు
- సహకరించిన ట్రాఫిక్ పోలీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి గుండెను, కిమ్స్ ఆస్పత్రిలో మరో వ్యక్తికి ఊపిరితిత్తులను ట్రాఫిక్ పోలీసులు సకాలంలో తరలించి వారి ప్రాణాలను కాపాడారు. గ్రీన్ ఛానల్లో భాగంగా ఒకే రోజు రెండు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి సకాలంలో అవయవాలను సరఫరా చేశారు. హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం గుండెను తరలించారు. బుధవారం మలక్పేట్ యశోద ఆస్పత్రి నుంచి మధ్యాహ్నం 1:44 నిమిషాలకు గుండెను సేకరించిన డాక్టర్లు 1:56 నిమిషాలకల్లా నిమ్స్ ఆస్పత్రికి చేర్చారు. 10.5 కిలోమీటర్ల దూరంలోని నిమ్స్కు కేవలం 12 నిమిషాల్లోనే చేర్చారు. కొండాపూర్ స్పెషల్ బ్రాంచ్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వీరబాబు ఈనెల 12న ఖమ్మం జిల్లా గొల్లగూడెం వద్ద బస్సు ఢకొీనడంతో బైకు మీద నుంచి పడి గాయపడ్డారు. అతన్ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. మంగళవారం వీరబాబు బ్రెయిన్ డెడ్ అయినట్టు డాక్టర్లు ప్రకటించారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు గుండె దానానికి ముందుకొచ్చారు. గుండె కోసం పెయింటర్ అయిన రోగి జీవన్దాన్లో మంగళవారం నమోదు చేసుకున్నాడు. దీంతో నిమ్స్లో అతనికి కానిస్టేబుల్ గుండెను అమర్చారు. ఇంత త్వరగా రోగికి గుండె దొరకడం అరుదైన ఘటనగా డాక్టర్లు అభిప్రాయపడ్డారు. గతంలోనూ నిమ్స్లో గుండె మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. అయితే, బయటి నుంచి నిమ్స్కు గుండెను తీసుకురావడం ఇదే తొలిసారి.
ఎయిర్పోర్టు నుంచి 27 నిమిషాల్లోనే..
బేగంపేట్ కిమ్స్ ఆస్పత్రిలో ఓ రోగి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతున్నాడు. అత్యవసరంగా ఊపిరితిత్తుల శస్త్రచికిత్స చేయాల్సి రావడంతో డాక్టర్లు ట్రాఫిక్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన పోలీస్ అధికారులు సైబరాబాద్ పోలీసులతో సమన్వయం చేశారు. ఎక్కడా ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలూ తీసుకున్నారు. రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి కిమ్స్ ఆస్పత్రికి 36.8 కిలోమీటర్ల దూరం ఉంది. విమానాశ్రయంలో ఉదయం 9.52 నిమిషాలకు ఊపిరితిత్తులను ప్రత్యేక అంబులెన్స్లో తీసుకుని బేగంపేట్ కిమ్స్ ఆస్పత్రికి 10.19 నిమిషాలకల్లా చేర్చారు.