Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా వైరస్ మూడోసారి వ్యాప్తి కాకుండా అన్ని చర్యలు తీసుకోకపోతే రెండో విడతలో మాదిరిగా పెద్ద ఎత్తున నష్టపోతామని హైకోర్టు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. మూడో దశ ముప్పు ఉందనే హెచ్చరికలను తీవ్రంగా పరిగణించాలని చెప్పింది. కోవిడ్ 19 పరీక్షలు, వైద్య సేవలు, పడకలు, ఆక్సిజన్, ముఖ్యంగా పిల్లలకు నిలోఫర్లోనే కాకుండా జిల్లాల్లోని ఆస్పత్రుల్లో సైతం వైద్య సౌకర్యాల కల్పన కోసం చర్యలు తీసుకోవాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ టి వినోద్కుమార్ల నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్పై దాఖలైన వివిధ రకాల ప్రజాహిత వ్యాజ్యాలను హైకోర్టు మరోసారి విచారించింది. విపత్తుల నిర్వహణ చట్టం కింద కరోనా కట్టడి కోసం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సుల అమలుకు తీసుకున్న చర్యలపై 22న జరిగే విచారణ నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అందుకు సంబంధించిన కల్ గ్రేడెడ్ రెస్సాన్స్ యాక్షన్ ప్లాన్ ఏదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విద్యా సంస్థలు తెరిచిన కారణంగానే కాకుండా వినాయక నిమజ్జనాల వల్ల కూడా కరోనా వ్యాప్తి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. సీరో సర్వేలెన్స్, కోవిడ్ వేరియంట్ అనాలసిస్ కూడా చేయాలన్న కమిటీ చేసిన సిఫార్సులపై నివేదిక ఇవ్వాలని కోరింది. నిపుణల కమిటీలో 12 మంది ఉన్నారనీ, ఆ కమిటీ చేసిన సిఫార్సులపై అంశాల వారీగా చేపట్టిన చర్యల గురించి వివరించాలని అడిగింది. గతంలో కోరిన మేరకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఇవ్వకపోడంపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా మందులను అత్యవసర జాబితాలో చేర్చే అంశంపై స్పష్టత ఇవ్వకపోవడం సరికాదని చెప్పింది. ఖమ్మంలో టీచర్లు కరోనా బారిన పడ్డారంటే పిల్లలకు వచ్చే ప్రమాదం ఉందనీ, దీనికి తోడు వారు క్యారియర్లుగా మారే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించింది. గ్రామాల్లో రోడ్లు దారుణంగా ఉన్నాయనీ, అక్కడ వాళ్లు రోగాలబారిన పడితే వైద్యం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్ఏటీ టెస్ట్ల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయనీ, అందువల్ల ఆర్టీపీసీఆర్ టెస్ట్లను ఎక్కువగా చేయాలనీ, లేకపోతే ఆర్ఏటీ టెస్ట్లో నెగిటివ్ వచ్చిందని తిరిగొస్తే కరోనా వ్యాప్తి అవుతుందని హెచ్చరించింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ల్లో 1.79 శాతం పాజిటివ్ వస్తుందంటే అది చిన్న విషయం కాదని చెప్పింది. ఖమ్మంలో టీచర్లు కరోనా బారిన పడ్డారనే వార్తలలపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి తోడు డెంగీ కూడా వస్తున్నాయనీ, జ్వరాలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మూడో దశ వ్యాప్తి కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఏజీ బిఎస్ ప్రసాద్ చెప్పారు. కరోనా మందుల్ని అత్యవసర మందుల జాబితాలో చేర్చటం గురించి చెప్పేందుకు గడువు కావాలని కేంద్రం తరఫున రాజేశ్వరరావు కోరారు.