Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుటుంబానికి ప్రభుత్వం భరోసా, ఓదార్పు ఇవ్వాలి
- చిన్నారి కుటుంబానికి పవన్కల్యాణ్, కోమటిరెడ్డి, షర్మిల, మల్లులక్ష్మీ పరామర్శ
నవతెలంగాణ - సరూర్నగర్
సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై దారుణ సంఘటన తనను ఎంతో కలచి వేసిందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ అన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేవరకు జనసేన పోరాటం ఆపదని, బాధిత కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు. హైదరాబాద్లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యకు గురైన చిన్నారి తల్లిదండ్రులను బుధవారం ఆయన పరామ ర్శించారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వైఎస్ ఆర్టీపీ అధ్యక్షులు షర్మిల కూడా ఆ కుటుం బాన్ని కలిశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం భరోసా, ఒదార్పు ఇవ్వాలని పవన్ కోరారు.
కేసీఆర్ పరామర్శించాలి : ఎంపీ కోమటిరెడ్డి
చిన్నారి ఘటనలో నిందితున్ని ఇంకా పట్టుకోకపోవడం బాధాకరమని, సీఎం కేసీఆర్ వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సిటీలో ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉన్నా నిందితున్ని పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. ప్రభుత్వం వల్ల కాకపోతే కాంగ్రెస్ పార్టీ నిందితున్ని పట్టు కుంటుందన్నారు. బిడ్డను పోగొట్టుకున్న బాధితులను పరామర్శించేందుకు టీఆర్ఎస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు సమయం లేదు కానీ, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కు అపోలోలో హీరోను పరామర్శించేందుకు టైమ్ ఉందా? అని ప్రశ్నించారు.
నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్వా ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు.
హంతకుడిని కఠినంగా శిక్షించాలి: షర్మిల
ఘటన జరిగి ఆరు రోజులైనా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. పిల్లల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్క లేదా? అని ప్రశ్నించారు. పోలీసులు కేసీఆర్ కుటుంబం కోసం పనిచేస్తున్నారా? ప్రజల కోసం పనిచేస్తున్నారా? అని నిలదీశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.