Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేసిన వరి పంటను కొంటారో.. లేదోనని రైతుల్లో ఆందోళన
- వచ్చే యాసంగిలో ఏ పంట వేయాలో తెలియక ఆగం
- అన్నదాతలకు శాపంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు
- 'ప్రత్యామ్నాయం' చూడాలని సర్కారు సూచనలు
- 20ఏండ్లలో 90శాతం పడిపోయిన ఆరుతడి పంటల సాగు
- ఇప్పుడు వేద్దామన్నా.. ఆ పంటలకూ 'మద్దతు' కల్పించని కేంద్రం
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఎఫ్సీఐ దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో 63శాతం భర్తీ చేసిన తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా నిలిచి ఔరా! అనిపించింది. గోదావరి జలాలను ఎత్తిపోసుకుని బీడు భూములను సైతం మాగాణిగా మార్చుకుని పంజాబ్కు ధీటుగా వరి పండించే స్థాయికి ఎదిగిన రాష్ట్రంలో ఇప్పుడు 'ముందు నుయ్యి.. వెనుక గొయ్యి' అన్న చందంగా రైతుల పరిస్థితి మారింది. ఏడేండ్లుగా వరివైపే ప్రోత్సహించిన సర్కారు కనీస 'ప్రత్యామ్నాయ'ఆలోచనలు చేయలేదు. ఆ దిశగా కేంద్రమూ ఆయా ఆరుతడి పంటలకు మద్దతు ధరలు కల్పించలేదు. సాధారణ సాగు విస్తీర్ణానికి మించి నాలుగింతలు వరి సాగవుతున్న ఈ వానాకాలం పంట దిగుబడిలో సగమే కొంటామని కేంద్రం మెలిక పెట్టింది. వచ్చే యాసంగిలో ఒక్క కిలో కూడా పారాబాయిల్డ్ బియ్యం కొనబోమని తెగేసి చెప్పింది. ఇన్నాళ్లూ ప్రత్యామ్నాయ ఊసే ఎత్తని సర్కారు ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పడంతో రైతుల్లో భయం పట్టుకుంది. '20ఏండ్లలో 98శాతం మేర పడిపోయిన ప్రత్యామ్నా య పంటలను ఇప్పటికిప్పుడు వేద్దామన్నా.. కేంద్రం నుంచి కనీస మద్దతు ధర లేదు. రాష్ట్రంలో మార్కెట్ లేదు.' అని రైతులు చెపుతున్నారు. రైతులను ఆదుకునేందుకు నిర్ణయాలు ఉండాలి తప్ప..వారిని మరింత అగాదంలోకి నెట్టేవిధంగా చేయవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుసంఘాలు విజ్ఞప్తి చేశాయి.
సర్కారు చేతులెత్తేస్తే...
వచ్చే యాసంగి నుంచి ఒక్క కిలో కూడా బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం తెగేసి చెబుతోంది. రాష్ట్రప్రభుత్వం గతేడాది 92 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఈ వానాకాలం పంటలో 55 లక్షల ఎకరాల్లో కోటిన్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందనేది అంచనా. అయితే, 60లక్షల మెట్రిక్టన్నులే కొంటామని కేంద్రం మెలిక పెట్టింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం మొండిగా ఉంటే తాము ఏం చేయగలమంటూ సర్కారు చేతులెత్తేస్తే తాము ఏమి కావాలంటూ వరి వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. 60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొని మిగిలింది వ్యాపారులకు వదిలేసే పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే వ్యాపారులు ఆమాంతం ధరలు తెగ్గోసి రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనే పరిస్థితులు రాక తప్పదని మార్కెటింగ్ అధికారి ఒకరు 'నవతెలంగాణ'తో చెప్పారు. వచ్చే యాసంగి నుంచి వరి వద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ చెపుతున్నారు. అసలు ఈ వానాకాలంలో వేసిన వరి పంటను అయినా కొంటారా' అని రైతులు సందేహిస్తున్నారు. దీనిపైనా రైతులకు ప్రభుత్వాలు భరోసా ఇవ్వలేని స్థితిలో ఉన్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు తప్ప రైతుల సమస్యలను పట్టించుకునేందుకు ప్రభుత్వాలు చొరవచూపడం లేదన్న విమర్శలున్నాయి.
20ఏండ్లలో 90శాతానికి పడిపోయిన పంటలు
ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని చెబుతున్నా కేంద్రం నుంచిగానీ, రాష్ట్రం నుంచిగానీ ఆరుతడి పంటలకు సరైన మద్దతు ధర కల్పించకపో వడంతో పర్యవసానంగా ఏయేటికాయేడు ఆ పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతూ వచ్చింది. అది ఏకంగా 20ఏండ్లలో 90శాతానికి పడిపోయింది. కరీంనగర్ జిల్లాలో ఆ పరిస్థితులను పరిశీలిస్తే 2001లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే 1.80లక్షల ఎకరాల్లోనే సాగైన వరి ఇప్పుడు ఏకంగా 10లక్షల ఎకరాలకుదాటింది. అదే ఆరుతడి పంటలు చూస్తే 2001లో మినుములు, పెసర్లు, శనిగలు సాగు సుమారు 9వేల ఎకరాల్లో ఉండేది. అది కాస్త 2021కి వచ్చే సరికి కనీసం 50 ఎకరాల్లోకూడా సాగవడం లేదు.
ఆరుతడి పంటల్లో మొక్కజొన్ననే ప్రధానంగా సాగు చేసే జిల్లాలో నాలుగేండ్లుగా సాధారణ సాగు విస్తీర్ణంలో నాలుగోవంతు కూడా సాగవడం లేదు. కందుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక వరిని మించి ఒకప్పుడు జిల్లాలో సాగైన పత్తి ఐదేండ్లుగా తగ్గుతూ వస్తోంది. 2001లో లక్షన్నర ఎకరాల్లో సాగైన పత్తి.. ఇప్పుడు 50వేల ఎకరాల్లోనే సాగవడం గమనార్హం. పెసర, మినుము, సోయా చిక్కుడు పంటలను మద్దతు ధరపై అనుమతించాలని గతేడాది రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కేంద్రానికి లేఖ రాసింది. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, వరి మాత్రమే పరిమితంగా కొంటామని, మినుము, సోయా పంటల దిగుబడిలో 25శాతానికి మించి కొనబోమని కేంద్రం స్పష్టం చేసింది.