Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో తాజాగా 259 మందిలో కరోనా ఉన్నట్టు బయటపడింది. ఒకరు మరణించారు. గురువారం విడుదల చేసిన బులెటిన్లో పాజిటివ్ రేటు 0.44 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు 58,261 మందికి టెస్టులు చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో 52,261 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 6,201 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 1,633 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,282 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా కోలుకున్న 301 మందిని డిశ్చార్జి చేశారు. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 72 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా కామారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, ములుగు, వికారాబాద్ జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.
ఐదు జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రంలో బుధవారంతో పోలిస్తే గురువారం కేవలం ఐదు జిల్లాల్లో మాత్రమే కేసులు పెరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం, కొమురంభీం ఆసిఫాబాద్, నారాయణపేట, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కేసులు పెరిగాయి.
కరీంనగర్లో సగానికి తగ్గిన కరోనా
కరీంనగర్ జిల్లాల్లో 11 కేసులు నమోదయ్యాయి. బుధవారం 22 కేసులు రాగా గురువారానికి సగానికి తగ్గాయి. కాగా రాష్ట్రంలో జీహెచ్ఎంసీతో సహా 25 జిల్లాల్లో తక్కువగా నమోదయ్యాయి. ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ - మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్లగొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ రూరల్ జిల్లాల్లో పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య తగ్గింది. జనగామ, జోగులాంబ గద్వాల, ములుగు జిల్లాల్లో వరసగా రెండో రోజూ కేసుల్లో పెరుగుదల గానీ, తగ్గుదల గాని చోటు చేసుకోలేదు.