Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదివారమే దొరికిండు! : రాజు తల్లి వీరమ్మ ఆరోపణ
నవతెలంగాణ-మోత్కూరు/అడ్డగూడూరు
'నా బిడ్డ రాజును పోలీసులే ఉరికించి చంపిండ్రు' అని చైత్ర కేసులో నిందితుడు రాజు తల్లి వీరమ్మ, భార్య మౌనిక ఆరోపించారు. హైదరాబాద్లో ఆరేండ్ల చిన్నారి చైత్రపై లైంగికదాడి, హత్య కేసులో నిందితుడు పులికొండ రాజు స్టేషన్ ఘణపురం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. వారు బుధవారం రాత్రి యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో రాజు అక్కబావ రుస్తాపురం అనిత, నర్సింహా ఇంటికి వచ్చారు. గురువారం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. తమను గత శుక్రవారం సైదాబాద్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారని తెలిపారు. రాజు దొరికితేనే విడిచి పెడతామని చెప్పారన్నారు. ఆదివారమే రాజు పోలీసులకు దొరికాడని, ఎన్కౌంటర్ చేయాలంటూ పైనుంచి ఆదేశాలు వచ్చాయంటూ పోలీసులు మాట్లాడుకుంటుంటే తాము విన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత.. ఓసారి దొరికాడని, మరోసారి దొరకలేదని పోలీసులు మాట్లాడుకుంటున్న దాన్ని బట్టి రాజు ఆదివారమే పోలీసులకు దొరికినట్టు తమకు అర్థమైందని తెలిపారు. బుధవారం తమతో తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని మిమ్మల్ని విడిచి పెడుతున్నామని చెప్పారని, అప్పుడే తమకు అనుమానం వచ్చిందని.. రాజును ఏమో చేస్తున్నారని భావించామన్నారు. పోలీసులను అడిగితే దొరకలేదని చెప్పి.. తమను ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద రాత్రి బస్సు ఎక్కించారని తెలిపారు. తెల్లవారుజామున మూడు గంటలకు తాము అడ్డగూడూరుకు చేరుకున్నామని చెప్పారు. రాజు రైలు కింద పడి చనిపోయాడని అంటున్నారని, కానీ పోలీసులే చంపారని ఆరోపించారు. హైదరాబాద్లో ఉన్న తమ ఇల్లును కూలగొట్టారని, సొంతూరు జనగామ జిల్లా కొడకండ్లలో కూడా తమకు ఏమీ లేదని అన్నారు. అనంతరం వారిని పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చి వరంగల్కు తరలించారు.