Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరితో చర్చించాకే ఫస్టియర్ పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలి : తెలంగాణ ఇంటర్ విద్యాపరిరక్షణ సమితి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు గందరగోళంలో ఉన్నారని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) విమర్శించింది. ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించడంతో వారు ఆందోళన చెందుతున్నారని తెలిపింది. అకడమిక్ క్యాలెండర్ దెబ్బతింటున్నదనీ, ఇంటర్ ఫస్టియర్ చదవాలా? సెకండియర్ చదవాలా?అన్నది అర్థం కావడం లేదని పేర్కొంది. ఈ మేరకు టిప్స్ కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్, వేములు శేఖర్, నగేశ్, రహీం, సమన్వయకర్త ఎం జంగయ్య గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1.13 లక్షల అడ్మిషన్లు దాటాయని తెలిపారు. కానీ 1,700 వరకు అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, అతిధి అధ్యాపకుల నియామకంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. దీంతో ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతున్నదని వివరించారు. ఆ బోర్డులో కొందరు అధికారులు, కార్పొరేట్, ప్రయివేటు కాలేజీలతో కుమ్మక్కై ప్రభుత్వ కాలేజీలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫస్టియర్ పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, మేధావులతో అభిప్రాయసేకరణ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోరారు. అసైన్మెంట్, ఇంటర్నల్ పరీక్షల ద్వారా ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మార్కులు వేయొచ్చని సూచించారు. అర్ధసంవత్సరం పరీక్షలు లేదా ప్రీఫైనల్ పరీక్షల ద్వారా మార్కులను వేసేందుకు అవకాశముందని కోరారు. ఇలాంటి ప్రత్యామ్నాలను పట్టించుకోకుండా ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహిస్తామనటంతో సెకండియర్ విద్యార్థులు గందరగోళంలో ఉన్నారని తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.