Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుట్టుచప్పుడు కాకుండా పూడ్చి పెట్టిన వైనం..
నవతెలంగాణ - కాగజ్నగర్ రూరల్
అడవి జంతువుల వేట ఇద్దరి ప్రాణాన్ని తీసింది. వన్య మృగాల కోసం విద్యుత్ తీగలతో అమర్చిన వలలో మరొక బృందం చిక్కుకొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. అయితే, గుట్టుచప్పుడు కాకుండా రెండు మృతదేహాలను గుర్తుతెలియని వ్యక్తులు పూడ్చిపెట్టారు. ఈ ఘటన కుమురంభీం-ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం విలేజ్ నెంబర్ 13 శివారులో గురువారం జరిగింది. రూరల్ సీఐ రాజేంద్రప్రసాద్, బాధితుల కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నారం గ్రామానికి చెందిన తీగల దుర్గరాజ్(26), కన్నెపెల్లి సత్తయ్య(39) రాంనగర్ పంచాయతీ విలేజ్ నెంబర్ 6 శివారులోగల ఆటవీ ప్రాంతంలో అడవి జంతువులను వేటాడేందుకు బుధవారం రాత్రి వెళ్లారు. ఈ క్రమంలో శివారులో అడవి జంతువులను వేటాడేందుకు గుర్తు తెలియని వ్యక్తులు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి ఇద్దరూ మృతిచెందారు. తెల్లవారినప్పటికీ దుర్గరాజ్, సత్తయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఫోన్ చేశారు. ఫోన్ రింగ్ అవుతున్నప్పటికీ సమాధానం ఇవ్వలేదు. దీంతో కుటుంబీకులు గాలింపు చేపట్టారు. ఫోన్ రింగ్ శబ్ధం ఆధారంగా వెళ్లి గురువారం సాయంత్రం ఒకచోట చెత్తకుప్పలో ఫోన్ను గుర్తించారు. అక్కడ పరిశీలించగా ఇద్దరి మృతదేహాలు మట్టిలో పూడ్చిపెట్టి ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ సీఐ రాజేంద్రప్రసాద్, ఈజ్ గాం ఎస్ఐ సందీప్ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్తో తనిఖీ చేశారు. మృతదేహాలను ఎవరు పూడ్చి పెట్టారనే విషయాలు తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు. దుర్గరాజ్కు భార్య, కుమారుడు, కన్నెపెల్లి సత్తయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఘటన స్థలాన్ని జెడ్పీ వైస్ చైర్మెన్ కోనేరు కృష్ణారావు, తహసీల్దార్ ప్రమోద్ పరిశీలించారు.