Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఎస్సీ గురుకుల విద్యార్థులు రికార్డు సృష్టించారు. ఈ మేరకు టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి రోనాల్డ్ రోస్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 638 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని వివరించారు. జేఈఈ మెయిన్లో 44 మంది విద్యార్థులు 90 పర్సెంటైల్ స్కోర్ సాధించి అద్భుత ప్రతిభను కనబరిచారని తెలిపారు. దినసరి కూలీలు, ట్యాక్సీ డ్రైవర్లు, ఆటో రిక్షా డ్రైవర్లు, వ్యవసాయ కూలీల పిల్లలు ఈ ఘనత సాధించారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉన్నత ప్రమాణాలతో కూడిన లాంగ్టర్మ్ కోచింగ్ ఇవ్వకపోతే విద్యార్థులు ఈ ఘనత సాధించే వారు కాదని స్పష్టం చేశారు. 2015 నుంచి 615 మంది ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్లు పొందారని వివరించారు. టీఎస్డబ్ల్యూఆర్ ఈఐఎస్ గౌలిదొడ్డి కాలేజీలో చదివిన జె గాయత్రి 96.1 పర్సెంటైల్ స్కోర్ సాధించారని తెలిపారు. 'నా తండ్రి చిన్నతనంలో చనిపోయారు. మా అమ్మ కూలీపని చేస్తుంది. ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో చదివి ఐఏఎస్ కావడమే నా లక్ష్యం'అని గాయత్రి తెలిపారు. గౌలిదొడ్డిలో చదివిన మరో విద్యార్థిని ఈ కావ్య 97.2 పర్సెంటైల్ స్కోర్ సాధించారని పేర్కొన్నారు. 'ఐఏఎస్ అధికారినై పేద మహిళలు, బలహీనవర్గాల ప్రజల సాధికారత కోసం పనిచేస్తాను'అని వివరించారు. ర్యాంకులు పొందిన విద్యార్థులను రోనాల్డ్రోస్ అభినందించారు.
జేఈఈ మెయిన్లో మైనార్టీ గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్ ఫలితాల్లో మైనార్టీ గురుకుల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ మేరకు మైనార్టీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి బి షఫీఉల్లా గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 17 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్లో మంచి పర్సెంటైల్తో జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని తెలిపారు. మహమ్మద్ జునాయిద్ 93.5 పర్సెంటైల్, అబ్దుల్ మొయిద్ 86.5 పర్సెంటైల్, జి తిరుమల్ 84.5 పర్సెంటైల్ స్కోర్ సాధించారని వివరించారు.