Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్
- ఆర్జీ-2లో సింగరేణి కార్మిక పోరుయాత్ర
నవతెలంగాణ - యైటింక్లైన్ కాలనీ
కోల్ ఇండియా మాదిరి సింగరేణిలోనూ క్యాడర్ స్కీములు అమలు చేయాలని, అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ తిరిగి చెల్లించాలని, 2020-21 వాస్తవ లాభాలు ప్రకటించి కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు వీడి సమస్యలు పరిష్కరించాలన్నారు.
సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి కార్మిక పోరుయాత్ర నాలుగోరోజు గురువారం పెద్దపల్లి జిల్లా ఆర్జీ-2 ఏరియాలో కొనసాగింది. ఆర్జీ-2లోని సీహెచ్పీ, కృషిభవన్, ఆర్వీఆర్ పోతన కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలు, బొగ్గు పరిశ్రమల ప్రయివేటీకరణ మానుకోవాలని, కార్మిక వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, వ్యవసాయ విద్యుత్తు సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో పనిచేస్తున్న ప్రతి కార్మికునికీ 250 గజాల స్థలం కేటాయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయిపడిన రూ.12వేల కోట్లు తక్షణమే ఇవ్వాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వాగ్దానం ప్రకారం కార్మికుల మారుపేర్లు మార్చాలని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు పని భద్రత, వేతనాల పెంపు ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మందా నరసింహారావు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి ఏ.ముత్యంరావు, ఆర్జీ-2 కార్యదర్శి ఉల్లి మొగిలి, ఎస్ వెంకన్న, వి.రాజేశం, ఎస్.రాజన్న, ఏ.భూమయ్య, జి.సంతోష్, సిహెచ్ ఒదేలు, జి.సురేష్, పిఎన్ఎం కళాకారులు రాజు, సిహెచ్.లక్ష్మీనారాయణ, నాగమణి, హైమదా పాల్గొన్నారు.