Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పించుకున్న మావోయిస్టు అగ్రనేత సురేష్సురానా
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ నుంచి మావోయిస్టు అగ్రనేత ఒకరు తప్పించుకున్నారు. కాగా పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని సాయుధ బలగాలు స్వాధీన పర్చుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఒడిశాకు చెందిన మల్కన్గిరి, కోరపుట్ జిల్లాల సరిహద్దులో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నది. బదిలీ హిల్స్ ఏరియాలో మావోయిస్టులు సమావేశమైనట్టు ఒడిశా స్పెషల్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఒడిశాతో పాటు సరిహద్దు భద్రతా దళానికి చెందిన సాయుధ బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీంతో అలర్ట్ అయిన మావోయస్టులు పై నుంచి కాల్పులు జరపగా సాయుధ బలగాలూ ఎదురు కాల్పులు జరిపాయి. దాదాపు రెండున్నర గంటల పాటు ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగాయి. కాగా కాల్పులు జరుపుతూనే పెద్ద సంఖ్యలో ఉన్న మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. వీరిలో ఆంధ్రాకు చెందిన మావోయిస్టు అగ్రనేత సురేష్ సురానా కూడా ఉన్నాడని తెలుస్తోంది. మావోయిస్టులు తప్పించుకున్న ప్రాంతం నుంచి సాయుధ పోలీసు బలగాలు పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీన పర్చుకున్నారు. అంతేగాక కిట్ బ్యాగులు, మావోయిస్టు సాహిత్యం, పెన్డ్రైవ్లు,వాకీ టాకీలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఈ సంధర్భంగా మల్కన్గిరి జిల్లా ఎస్పీ ప్రహ్లాద్ మీనా తెలిపారు. పారిపోయిన మావోయిస్టులు సరిహద్దుల్లోని ఆంధ్రద్రేశ్లోకి వెళ్లినట్టు గుర్తించామన్నారు. దీనిపై ఏపీ పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్టు ఆయన తెలిపారు.