Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్
- పాదయాత్రతో ప్రభుత్వాలు కండ్లు తెరవాలి : సాయిబాబు
నవతెలంగాణ- బీబీనగర్
సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, కనీస వేతనాలు ఇచ్చినప్పుడే వారి జీవితాలు బాగుపడతాయని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక గర్జన పాదయాత్ర గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో సాగింది. గూడూరు గ్రామంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్రకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సభలో వెంకట్ మాట్లాడుతూ.. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్ మాట్లాడుతూ.. మున్సిపల్, పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్రకు తమ సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు.
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రతో కండ్లు తెరవాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా పారిశ్రామిక కార్మికుల జీవితాలు 18వ శతాబ్దం నాటివిగా ఉన్నాయన్నారు. రాష్ట్ర రాజధానికి దగ్గరలో ఉన్న భువనగిరిలో కార్మికుల జీవనశైలి దుర్భరంగా ఉందన్నారు. సరైన వేతనాలు, వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పాదయాత్ర బృంద సభ్యులు.. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. బీబీనగర్ పారిశ్రామిక ప్రాంతంలో సుమారు 65 పరిశ్రమలు ఉన్నాయన్నారు. ఇందులో సుమారు 6200 మంది కార్మికులు వివిధ విభాగాల్లో పని చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వాలు కనీస వేతన సవరణ చేయకపోవడం వల్ల ఇక్కడ కార్మికులు రూ.892 కోట్లు నష్టపోయారన్నారు. ఈ డబ్బులు మొత్తం యాజమాన్యాల జేబుల్లోకి వెళ్లాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి కనీస వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు పాదయాత్ర బృందాన్ని అంగన్వాడీ, పంచాయతీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాదయాత్ర బృందం సభ్యులు జయలక్ష్మీ, శ్రీధర్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్, డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్, సీఐటీయూ మండల కార్యదర్శి బండారు శ్రీరాములు, నాయకులు గాడి శ్రీనివాస్, గడ్డం ఈశ్వర్, పొట్ట యాదమ్మ, పాశం బాలయ్య, సిలివేరు రమేశ్ పాల్గొన్నారు.