Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు
- ముగిసిన కార్మిక గర్జన పాదయాత్ర
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
అసంఘటితరంగంలోని కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, కనీస వేతనం రూ.24వేలు నిర్ణయించి అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు ప్రభుత్వాన్ని కోరారు. ఈనెల 13న మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో చేపట్టిన కార్మిక గర్జన పాదయాత్ర గురువారం ముగిసింది. ఈ కార్యక్రమం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయం ఎదుట నిర్వహించిన మహాధర్నాలో వంగూరు రాములు మాట్లాడారు. పోలేపల్లి సెజ్, ఫార్మా, ఇతర పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల సమస్యలను పాదయాత్ర ద్వారా అధ్యయనం చేశామన్నారు. జడ్చర్ల, భూత్పూరు, మహబూబ్నగర్ మండలాల్లోని పరిశ్రమల కార్మికులు, గ్రామ పంచాయతీ, మున్సిపల్, ఆశా, భవన నిర్మాణం, జాతీయ రహదారి విభాగంలో పనిచేసే కార్మికులు, కూలీల సమస్యలను తెలుసుకున్నామని చెప్పారు. ఈ సమస్యలన్నీ జిల్లా కార్మిక శాఖాధికారి దృష్టికి తీసుకెళ్దామంటే.. ఆయన కార్మికుల సమస్యలు వినే పరిస్థితిలో లేరన్నారు. చాలా మంది భవన నిర్మాణ కార్మికుల ఇన్సూరెన్స్ కార్డులు పెండింగ్లో ఉన్నాయన్నారు. వీటిని పరిష్కరించకుండా అధికారులు యజమానులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నా రని విమర్శిం చారు. 73 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో కనీస వేతనాల జీవోలను సవరించి గెజిట్ చేయాలని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లు, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా, జీపీ, మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీలకు పీఆర్సీ అమలు చేసి వేతనాలు పెంచాలన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు కిల్లే గోపాల్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఖమర్ అలీ, నల్లవెల్లి కురుమూర్తి, జిల్లా కోశాధికారి బోలె చంద్రకాంత్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వర్డ గలెన్న, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కేశవులు, ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యాదమ్మ, సాధన, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.